కొండాపూర్ (హైదరాబాద్), ఫిబ్రవరి 28: ఐటీ రంగంలో నూతన టెక్నాలజీల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సహాయసహకారాలు అందించేందుకు ఎప్పుడూ ముందుంటుంది. స్పేస్టెక్కు సంబంధించి ప్రభుత్వం కొత్తగా ఫ్రేమ్వర్క్ను రూపొందించిందని త్వరలో దాన్ని అమల్లో తెచ్చేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. సోమవారం హైటెక్సిటీలో టెక్ మహీంద్రా మెటావర్స్ టెక్నాలజీ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జయేశ్ రంజన్ మాట్లాడుతూ ఐటీ రంగ అభివృద్ధికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఎప్పుడూ ముందుంటారని, దేశంలో ఎక్కడా లేనివిధంగా నూతన ఆవిష్కరణలు, విధానాలను ప్రవేశపెట్టిన రాష్ట్రంగా తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. భవిష్యత్తులో మెటావర్స్ టెక్నాలజీకి మంచి ఆదరణ లభిస్తుందని, ఉద్యోగావకాశాలు భారీగా ఉంటాయన్నారు. ఇందులోభాగంగానే దేశంలోనే మొట్టమొదటిసారిగా మెటావర్స్ ప్లాట్ఫామ్పై స్పేస్టెక్ ఫ్రేమ్వర్క్ను రూపొందించి అమలు చేయనున్నామన్నారు. మెటావర్స్ టెక్నాలజీతో స్టార్టప్స్కు, యువతకు మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కల్పించే దిశగా ఆలోచించాల్సిందిగా టెక్ మహీంద్రా సంస్థ ప్రతినిధులను కోరారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లలో సైతం ఈ టెక్నాలజీని వినియోగంలోకి తీసుకురావాలన్నారు. రానున్న రోజుల్లో మెటావర్స్ టెక్నాలజీకి హైదరాబాద్ నగరం సెంటర్గా మారనున్నట్టు తెలిపారు. హైదరాబాద్, పుణెలతోపాటు బ్రిటన్, అమెరికాల్లో మెటావర్స్ డెవలప్మెంట్ స్టూడియోలను ఏర్పాటు చేసినట్టు, త్వరలోనే 1,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నాని పేర్కొన్నారు. భారత్లో రెండు ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని, మరిన్ని ప్రాజెక్టులు చేయబోతున్నట్టు, దీనికనుగుణంగా ఉద్యోగావకాశాలు పెరగనున్నాయన్నారు.