లండన్/జోహన్నెస్బర్గ్, నవంబర్ 25: దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్ కొత్త రకాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటివరకు ఏ రకంలోనూ లేని విధంగా ఈ కొత్త రకం కొమ్ముల్లో భారీగా ఉత్పరివర్తనాలు జరిగినట్టు వారు ఆందోళన చెందుతున్నారు. కొత్త వేరియంట్ వివరాలను లండన్ ఇంపీరియల్ కళాశాల వైరాలజిస్ట్ డాక్టర్ టామ్ పీకాక్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీన్ని ‘బీ.1.1.529’గా పిలుస్తున్నారు. ఇది ఆందోళనకరమైన వేరియంటేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఎంత వేగంగా విస్తృతంగా వ్యాపిస్తుందనే సంకేతాలను వారు గమనిస్తున్నారు. స్పైక్ మ్యుటేషన్లు (కరోనా వైరస్పై కొమ్ముల్లాంటి వాటిలో ఉత్పరివర్తనాలు) పెద్దసంఖ్యలో జరుగడం ఆందోళన కలించే అంశమని హెచ్చరిస్తున్నారు. ఇది భారీగా వ్యాపించడానికి, ప్రజల రోగ నిరోధకతను తప్పించుకొనేందుకు వైరస్కు బలాన్నిస్తుందని విశ్లేషిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో ఇప్పటికే 22 కొత్త వేరియంట్ కేసులను గుర్తించారు. అర్హులంతా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని, మాస్కులు ధరించాలని, పరిశుభ్రత, భౌతిక దూరం పాటించాలని, గాలి వెలుతురు ధారాళంగా ఉన్న ప్రదేశాల్లోనే సమావేశం కావాలని దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రజలకు సూచించింది. కొత్త వేరియంట్పై లండన్లో కూడా పరిశోధనలుజరుగుతున్నాయి.
ఆ ప్రయాణికుల స్క్రీనింగ్
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ వెలుగుచూడటంతో భారత్ అప్రమత్తమైంది. రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. దక్షిణాఫ్రికా, హాంకాంగ్, బోత్సువానా నుంచి గానీ లేదా ఆ దేశాల మీదుగా గానీ వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు క్షుణ్ణంగా స్క్రీనింగ్, పరీక్షలు నిర్వహించాలని సూచించింది.