ముంబై, ఏప్రిల్ 27: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఒక రోజు విరామానంతరం బుధవారం తిరిగి మార్కెట్ డౌన్ట్రెండ్లోకి మళ్లింది. క్రితం రోజు ర్యాలీ జరిపిన ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 537 పాయింట్లు క్షీణించి 56,819 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 162 పాయింట్ల నష్టంతో 17,038 పాయింట్ల వద్ద నిలిచింది.
చైనాలో లాక్డౌన్లు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలతో ప్రపంచ మార్కెట్లలో భారీగా అమ్మకాలు జరిగాయని, ఈక్విటీ మార్కెట్ల నుంచి ఇతర సురక్షిత పెట్టుబడి సాధనాల్లోకి నిధులు మళ్లుతున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ వివరించారు.
అధిక దవ్యోల్బణం, పెరుగుతున్న బాండ్ ఈల్డ్తో తక్కువ ప్రభావితమయ్యే బ్యాంకింగ్, ఐటీ, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలకే కట్టుబడి ఉండాలని ఇన్వెస్టర్లకు ఆయన సూచించారు. మంగళవారం అమెరికా మార్కెట్లు భారీగా పతనంకావడం, బుధవారం ఆసియాలోని టోక్యో, సియోల్ ఇండెక్స్లు నష్టాల్లో ముగియడం దేశీ ఇన్వెస్టర్లను నిరుత్సాహపర్చింది.
సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా బజాజ్ ఫైనాన్స్ షేరు 7.24 శాతం పతనమయ్యింది. బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, విప్రో, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతిలు 1.5-3.8 శాతం మధ్య తగ్గాయి. మరోవైపు టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, కొటక్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ స్వల్ప లాభాలతో ముగిసాయి.
రంగాల వారీగా చూస్తే పవర్ ఇండెక్స్ 1.86 శాతం తగ్గింది. యుటిలిటీస్, టెలికం, ఫైనాన్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్లు సైతం 1 శాతాన్ని మించి నష్టాల్ని చవిచూశాయి. మెటల్ ఇండెక్స్ ఒక్కటే స్వల్పంగా లాభపడింది. బీఎస్ఈ మిడ్-క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.88 శాతం మేర తగ్గాయి.
విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) అమ్మకాల జోరు పెంచారు. వీరు గురువారం రూ. 4,064 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించినట్టు ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సోమవారం ఎఫ్పీఐలు రూ. 3,303 కోట్లు మార్కెట్ నుంచి వెనక్కు తీసుకోగా, మంగళవారం రూ. 1,174 కోట్ల నికర అమ్మకాలు జరిపారు.
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మార్కెట్ విలువ తొలిసారిగా రూ.19 లక్షల కోట్ల మార్క్ను తాకింది. ఇప్పటికే దేశంలో అత్యంత విలువైన కంపెనీ అయిన ఆర్ఐఎల్ షేరు ఇంట్రాడేలో1.85 శాతం పెరిగి రూ.2,827 ఆల్టైమ్ గరిష్ఠస్థాయికి చేరింది.
ఈ ధర వద్ద కంపెనీ మార్కెట్ విలువ రూ. 19,12,814 కోట్లకు పెరిగింది. మార్కెట్ ముగిసే సమయానికి ఈ షేరు రూ.2,778 వద్ద నిలిచింది. ఈ ముగింపు ధర వద్ద మార్కెట్ విలువ రూ. 18,79,237 కోట్లు. గత ఏడాది అక్టోబర్లో తొలిసారిగా రూ.17 లక్షల మార్కెట్ క్యాపిటలైజేషన్కు చేరిన ఆర్ఐఎల్ ఈ ఏడాది మార్చిలో రూ. 18 లక్షల కోట్లను దాటింది.