ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలకు పంజాబ్ కింగ్స్ దిమ్మతిరిగే చెక్ పెట్టింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ టైటాన్స్పై పంజా విసిరింది. రబాడ విజృంభణతో గుజరాత్ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన కింగ్స్..బ్యాటింగ్లో దుమ్మురేపింది. టైటాన్స్ బౌలింగ్ను తుత్తునియలు చేస్తూ మరో నాలుగు ఓవర్లు మిగిలుండగానే ఎనిమిది వికెట్ల తేడాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ధవన్ ధనాధన్ అర్ధసెంచరీతో చెలరేగితే..రాజపక్స నిలకడ చూపించగా ఆఖర్లో లివింగ్స్టోన్ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. షమీని లక్ష్యంగా చేసుకుంటూ లివింగ్స్టోన్ మూడు భారీ సిక్స్లు, రెండు ఫోర్లతో మ్యాచ్కు ఘనమైన ముగింపు పలికాడు.
నేవి ముంబై: లీగ్లో పంజాబ్ కింగ్స్ స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకుంది. గత మ్యాచ్లో తమకు ఎదురైన ఓటమికి గుజరాత్ టైటాన్స్పై కసితీరా ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ ఎనిమిది వికెట్ల తేడాతో టైటాన్స్పై ఘన విజయం సాధించింది. దీంతో పది మ్యాచ్ల్లో ఐదు విజయాలు, ఐదు ఓటములతో 10 పాయింట్లు ఖాతాలో వేసుకుని ఐదో స్థానానికి చేరుకోగా, గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. తొలుత రబాడ(4/33) విజృంభణతో టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 143/8 స్కోరుకు పరిమితమైంది. యువ బ్యాటర్ సాయి సుదర్శన్(50 బంతుల్లో 65 నాటౌట్, 5ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, మిగతా వాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. గిల్(9), కెప్టెన్ హార్దిక్ పాండ్యా(1), మిల్లర్ (11), తెవాటియా (11), రషీద్ఖాన్(0) బ్యాట్లు ఝులిపించలేకపోయారు. అర్ష్దీప్సింగ్, రిషి ధవన్, లివింగ్స్టోన్ ఒక్కో వికెట్ తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ మరో నాలుగు ఓవర్లు మిగిలుండగానే 16 ఓవర్లలో 145/2 స్కోరు చేసింది. ఓపెనర్ ధవన్ (53 బంతుల్లో 62 నాటౌట్, 8 ఫోర్లు, సిక్స్), రాజపక్స(28 బంతుల్లో 40, 5 ఫోర్లు, సిక్స్), లివింగ్స్టోన్ (10 బంతుల్లో 30 నాటౌట్, 2 ఫోర్లు, 3 సిక్స్లు) చెలరేగారు. షమీ (1/43), ఫెర్గుసన్(1/29) ఒక్కో వికెట్ తీశారు. రబాడకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. బుధవారం పుణె వేదికగా బెంగళూరు, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరగుతుంది.
రబాడ అదుర్స్: తొలుత టాస్ గెలిచిన గుజరాత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిర్ణయాన్ని ఓపెనర్లు సాహా, శుభ్మన్ గిల్ నిలబెట్టలేకపోయారు. లీగ్లో మంచి ఫామ్మీదున్న వీరిద్దరు శుభారంభం అందించలేకపోయారు. రబాడ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో గిల్ రెండు ఫోర్లతో చెలరేగితే..సాహా మరో ఫోర్ కొట్టాడు. ఇన్నింగ్స్ జోరు అందుకుంటున్న తరుణంలో రిషి ధవన్ విసిరిన సూపర్ త్రోకు గిల్ తొలి వికెట్గా వెనుదిరిగాడు. ఓవైపు గిల్ ఔట్ అయినా ఇన్నింగ్స్ నిలబెడుతాడు అనుకున్న సాహాను రబాడ పెవిలియన్కు పంపాడు. దీంతో 34 పరుగులకే టైటాన్స్ ఓపెనర్లను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్, మిల్లర్, తెవాటియా, రషీద్ఖాన్ అలా వచ్చి ఇలా వెళ్లారు. తనదైన పేస్కు స్వింగ్ జోడిస్తూ రబాడ.. తెవాటియా, రషీద్, ఫెర్గుసన్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవైపు సహచరులు నిష్క్రమిస్తున్నా.. సుదర్శన్ ఆఖరి వరకు ఒంటరి పోరాటం చేశాడు.
గుజరాత్: 20 ఓవర్లలో 143/8(సుదర్శన్ 65 నాటౌట్, సాహా 21, రబాడ 4/33, లివింగ్స్టోన్ 1/15), పంజాబ్: 16 ఓవర్లలో 145/2 (ధవన్ 62 నాటౌట్, రాజపక్స 40, లివింగ్స్టోన్ 30 నాటౌట్, ఫెర్గుసన్ 1/29, షమీ 1/43)