నల్లగొండ ప్రతినిధి, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేలా కశ్మీర్ ఫైల్స్ సినిమాకు ప్రమోషన్ చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీలు కుట్ర పన్నుతున్నాయని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ఆరోపించారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాలో పండిట్లు మాత్రమే హింసకు గురయ్యారన్న కోణంలో చూపడం దుర్మార్గమని, కశ్మీర్లోని అన్ని వర్గాల ప్రజలు బాధితులేనని పేర్కొన్నారు.
పండిట్లు తీవ్రమైన అణచివేతకు గురయ్యారనడంలో సందేహం లేదని, మిగతా వారు కూడా ఉగ్రవాదుల దుశ్చర్యలకు బలయ్యారన్న విషయాన్ని విస్మరించకూడదని హితవు పలికారు. మంగళవారం నల్లగొండలోని సీపీఎం కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం బృందాకారత్ మీడియాతో మాట్లాడుతూ.. మల్లు స్వరాజ్యం తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగా మహిళా ఉద్యమాలకు స్ఫూర్తి అని కొనియాడారు.
కశ్మీర్ ఫైల్స్ సినిమాలో వాస్తవాలను పూర్తిగా వెలుగులోకి తేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని విమర్శించారు. కశ్మీర్లో తమ పార్టీ ఎమ్మెల్యే యూసుఫ్ తరిగామి కుటుంబం కూడా ఉగ్రవాదుల దాడులకు గురైందని, ఇద్దరు కుటుంబ సభ్యులను తరిగామి కోల్పోయారని గుర్తుచేశారు. ఎంతోమంది ముస్లిం లీడర్లను కూడా ఉగ్రవాదులు బలి తీసుకొన్నారన్నారు. వీటన్నింటినీ మరుగున పడేస్తూ ఒక వర్గానికి మాత్రమే నష్టం జరిగినట్టుగా ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ, ఆర్ఎస్ఎస్ కశ్మీర్ ఫైల్స్ను ప్రమోట్ చేయడం దారుణమన్నారు. కశ్మీరీలపై హింస, గుజరాత్ మారణ హోమం, సిక్కుల ఊచకోత ఇలా దేనికి దాన్నే ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉన్నదని సూచించారు.