రైతన్నకు పెట్టుబడి సాయం నిరాటంకంగా కొనసాగుతున్నది. వరుసగా నాలుగో రోజూ ఎకరాల వారీగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నది. ఆ పైసలను విడిపించుకునేందుకు ఏటీఎంలు, బ్యాంకుల వద్ద అన్నదాతల సందడి కనిపిస్తున్నది. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజుల్లో 5,65,658 మంది రైతులకు రూ.416.19 కోట్ల నగదు వారి ఖాతాల్లో జమైంది.
-నెట్వర్క్, డిసెంబర్ 31
ఉద్దెర పెట్టుడు మర్చిపోయినం
మాది గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి. గ్రామ శివారులో నాకు 12 గుంటల వ్యవసాయ భూమి ఉన్నది. పంటల సీజన్ మొదలైందంటే చాలు పెట్టుబడి రంది పట్టుకునేది. దుక్కి దున్ని, దుకాణంలో ఉద్దెర పెట్టి ఎరువులు, విత్తనాలు తీసుకచ్చేటోన్ని. పంట దిగుబడి వచ్చినంక అప్పు చెల్లించేవాడిని. మళ్లీ సీజన్ మొదలైతే మళ్లీ అదే పాత కథే. ఇక ఇంతే అనుకున్న. పరిస్థితి మారదనుకున్న. వ్యవసాయాన్ని వదిలేయాలనుకున్నా. కాని ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప ఆలోచన చేసిండు. రైతుబంధు పథకాన్ని తెచ్చి రైతులకు పెట్టుబడి కష్టాలు తీర్చిండు. ఇవాళ్ల రైతు బంధు కింద 1500 రూపాయలను సర్కారు నా బ్యాంకు ఖాతాలో జమ చేసింది. వ్యవసాయం కోసం పెట్టుబడి సాయం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంట.
-రేగుల తిరుపతి, సర్వారెడ్డిపల్లి(గంగాధర)
అప్పుల రందిలేదు.. కొత్త మోటర్ కొన్న..
నా పేరు మల్లెత్తుల మల్లయ్య. మాది వీణవంక. ఎవుసానికి అప్పుల రందితప్పి పండుగలెక్క అనిపిత్తంది. నాకు ఐదెకరాల భూమి ఉన్నది. తెలంగాణ రాకముందు నీళ్లులేక, కరెంట్లేక మస్తు గోసపడుదుం. పంట సరిగ్గా పండక అప్పుల పాలైదుం. సావుకారి దగ్గరికి పోనిది పని ఎల్లేదికాదు. పాణంబోయే పరిస్థితి ఉండేది. ఓ సారైతే పెట్టువడి పైసలు ఎల్లక ఎడ్లను గూడా అమ్మేదామనుకున్న. కానీ సాదుకున్న ఎడ్లను అమ్ముకునేందుకు మనసురాలే. ఇప్పుడు ఎవ్వలకు తలంచే అవసరం లేదు. సీఎం కేసీఆర్ సారు రైతుల గురించి ఆలోచన జేసి రైతుబంధు ఇత్తండు. నాకు పసలుకు రూ.25 వేలు అత్తన్నయి. విత్తనాల దగ్గర నుంచి పొలం నాటుపడేదాకా పెట్టువడికి ఎవ్వలకు చేయిచాపకుంట బ్యాంక్కు పోయి పైసలు దెచ్చుకొని కర్సులు ఎల్లదీసుకుంటున్న. పాత మోటర్ ఊకె కాలుతందని, కొత్త మోటర్ కొని పొలానికి నీళ్లు వెట్టుకుంటున్న. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతనే మా బతుకులు మారినయ్. ఎవుసానికి అయ్యే కర్సు ఇస్తండు. రైతు సచ్చిపోతే రూ.5 లక్షల రైతుభీమా ఇచ్చి కుటుంబాలను ఆదుకుంటుండు. వడ్లను గూడ సీఎం సారే కొని బ్యాంకులల్ల పైసలు ఏత్తండు. కేంద్రంల ఉన్న సర్కారు రైతులను ముంచుతంది. తెలంగాణ అచ్చినకాడికెల్లి, రైతుబంధు మొదలు వెట్టిన నాటిసంది ఎవుసం బాగుపడ్డది, రందిలేకుండా కడుపునిండా తిని, కంటినిండ నిద్రవోతన్నం. నాకైతే టైంకు పెట్టుబడి సాయం అందుతంది.
పెట్టుబడికి గోస తప్పింది..
ఇంతకుముందు విత్తనాలు, ఎరువులు కొనేందుకు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగేది. రైతుబంధుతో పెట్టుబడికి గోస తప్పింది. నాకున్న ఎనిమిదెకరాలకు ఆర్నెళ్లకోసారి రూ. 40వేలు బ్యాంకు ఖాతాలో జమైతున్నయ్..ఈ నగదుతో దున్నకానికి, కైకిళ్లు, ఎరువులు, విత్తనాలకు సరిపోతున్నయ్. రైతుల కోసం మంచి చేస్తున్న కేసీఆర్ను మరువబోం.
-గోనె నర్సయ్య, రైతు, గోపాలపురం (కరీంనగర్రూరల్)
ఖర్చులన్నీ ఎల్లుతున్నయ్..
నాకు మా ఊళ్లె ఐదెకరాల భూమి ఉన్నది. ఒకప్పుడు ఎవుసమంటే శానా కష్టమైతుండె. పంట సక్కగ పండేదికాదు. పెట్టుబడులకే మొత్తం పోతుండె. మళ్లో పసలు లాగోడి ఎల్లక అప్పులు తెచ్చి ఎల్లదీసుకునేది. ఇప్పుడు ఆ బాధ తప్పింది. సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయం చేస్తున్నడు. నాకు పసలుకు రూ.25వేలు వస్తయ్. ఇప్పటివరకు 8సార్ల పైసలు తీసుకున్న. వచ్చిన పైసలతోని కొంత భూమి సదును చేయించిన. పాత బాయిల పూటిక తీయించిన. నీళ్లకు ఢోకా లేకుంటపోయింది. ఇవన్నీ పెట్టుబడికింద అచ్చిన పైసలతోటే చేసుకున్న. మిగతా పైసల్ ట్రాక్టర్ కిరాయి, కూలీలకు పెట్టుబడికి అక్కరకు వస్తయి. కేసీఆర్ను రైతులం ఎప్పటికీ మరిచిపోం. ఇప్పుడు మాకు ఏ బాధాలేదు. ఖర్సులన్నీ ఎల్లుతున్నయి.
అప్పుల బాధ లేదు..
మాది ఇల్లందకుంట. గ్రామంల నాకు రెండెకరాల భూమి ఉంది. నేను, నా భార్య భారతమ్మ కలిసి ఎవుసం చేసేది. గతంల పంటలు సరిగ్గా పండక అరిగోసయ్యేది. పెట్టుబడులకు చాలా తండ్లాడేది. ఎరువులు, విత్తనాల కోసం అడ్తీ దారుల వద్ద అప్పులు తెచ్చి మరీ సాగు చేసేది. పండించిన పంట మొత్తం వడ్డీలకే పోయేది. మాకేం మిగులకపోయేది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మాకు ఇంత ఆసరా దొరికింది. సీఎం కేసీఆర్ రైతు బంధు పథకం కింద ఎకరానికి రూ.5వేల చొప్పన బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుండు. నాకు ఉన్న రెండెకరాలకు రూ.10 వేలు రావడంతో అడ్తీ దారుల వద్ద అప్పు చేయడం తప్పింది. వచ్చిన డబ్బులతో విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చు చేస్తున్నా. పంట సాయం చేస్తున్న కేసీఆర్ సార్కు ఎప్పుడు అండగా ఉంటా.
శావుకారికే సగం పోయేది..
ఒకప్పుడు అప్పులు తెచ్చి పంటలు వేసేటోళ్లం..గింజలు అమ్మినంక అచ్చిన పైసలు శావుకారికే సగం పోయేది..మిగిలిన డబ్బులతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. కేసీఆర్ సారు సీఎం అయినంక రైతులకు అన్ని మంచిగ జేత్తుండు. నాకు ఎకరం ముప్పై గుంటల భూమి ఉన్నది. మూడేండ్ల సంది ఆర్నెళ్లకోసారి రూ. 8750 ఖాతాల పడుతున్నయ్.. ఈ పైసలకు మరికొన్ని కలుపుకొని పెట్టుబడి ఖర్చులు ఎళ్లదీసుకుంటున్న. పంటలేసే టైంల అప్పుల బాధ తప్పింది.
కరోనాటైంల గూడా ఆపలె..
ఈ సర్కారు అచ్చినకాడి నుంచి రైతులకు మంచి జరుగుతంది. నాకు రెండున్నర ఎకరాల భూమి ఉన్నది. రైతుబంధు పథకం కింద పసలుకు రూ. 12500 ఖాతాల పడుతున్నయ్. కరోనా టైంల గూడా నగదు వేసిన్రు..ఈ పైసలు దున్నకానికి, ఎరువులకు సరిపోతున్నయ్. అప్పులు చేసే గోస తప్పింది. పంటలు అమ్ముకోంగా వచ్చిన డబ్బులతో ఇబ్బందిలేకుండా కుటుంబం గడుస్తున్నది.
-బెజ్జంకి దుర్గయ్య, రైతు, గోపాలపురం (కరీంనగర్రూరల్)