హైదరాబాద్, నవంబర్ 18: విమానాశ్రయాల అభివృద్ధి, నిర్వహణలో ప్రసిద్దిచెందిన జీఎమ్మార్కు మరో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో భాగస్వామ్యం లభించింది. ఇండోనేషియాలోని మెడాన్లో కౌలానము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్, ఆపరేషన్ బిడ్ను గెలుపొందినట్లు జీఎమ్మార్ ఇన్ఫ్రా సబ్సిడరీ అయిన జీఎమ్మార్ ఎయిర్ పోర్ట్స్ (జీఏఎల్) గురువారం ప్రకటించింది. మెడాన్ ఎయిర్పోర్ట్కు బిడ్డింగ్ అధారిటీ అయిన ఇండోనేషియా ప్రభుత్వ సంస్థ అంగాకాశ పుర2 (ఏపీ2)…జీఎమ్మార్ను వ్యూహాత్మక భాగస్వామిగా ఎంపికచేసింది. దీంతో ఈ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో 49 శాతం వాటాతో జీఎమ్మార్ భాగస్వామి అవుతుంది. 51 శాతం వాటా ఏపీ2 వద్ద ఉంటుంది. ఈ సంవత్సరాంతంలోగా భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు జరుగుతాయి. 25 సంవత్సరాల పాటు ఎయిర్పోర్ట్ నిర్వహణ, అభివృద్ధి, విస్తరణలు తాజా ప్రాజెక్టులో భాగమని పేర్కొంది. తమ కన్సార్షియం కౌలానము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ఇండోనేషియా పశ్చిమ ప్రాంతంలో ఇంటర్నేషనల్ హబ్గా తీర్చిదిద్దనున్నట్లు జీఎమ్మార్ గ్రూప్ ఎనర్జీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ చైర్మన్ శ్రీనివాస్ బొమ్మిడాల చెప్పారు.2018లో ఈ విమానాశ్రయం ద్వారా కోటి మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించారు.