నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి
నారాయణఖేడ్ : నారాయణఖేడ్ నియోజకవర్గంలోని 1.41 లక్షల ఎకరాలకు సాగు నీరందించే బసవేశ్వర ఎత్తిపోతల పథకం పూర్తయితే నియోజకవర్గ ప్రజల కష్టాలు శాశ్వతంగా దూరమవుతాయని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని క్యాబినెట్లో ఆమోదించడాన్ని హర్షిస్తూ శుక్రవారం నారాయణఖేడ్లోని రాజీవ్చౌక్ వద్ద ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నారాయణఖేడ్ మండలంలోని కొన్ని గ్రామాలతో పాటు కంగ్టి, మనూరు, నాగల్గిద్ద మండలాల్లో సాగునీటి వనరులు లేని కారణంగా వర్షాధార పంటలపై ఆధారపడి వ్యవసాయం చేయడం, వర్షాలు అనుకూలించని పక్షంలో ఆర్థిక ఇబ్బందులతో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే దుస్థితి ఉన్నప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలోని గత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుతోపాటు తనపై ఉన్న నమ్మకంతో ప్రజలు రెండుసార్లు భారీ మెజార్టీతో గెలిపించారన్నారు.
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సాగునీటి వనరుల కల్పనలో భాగంగా రూ.1774 కోట్ల భారీ వ్యయంతో బసవేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణానికి చర్యలు చేపట్టడంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు కింద 19ఏ ప్యాకేజీ ద్వారా మరో 35 వేల ఎకరాలకు నల్లవాగు ప్రాజెక్టు నిత్యం నిండుకుండలా ఉండేలా సింగూరు నీటిని నల్లవాగుకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణానికి వేగవంతంగా చర్యలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్, సహకరిస్తున్న మంత్రి హరీశ్రావులకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ల తీరుపై ఎమ్మెల్యే మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం విషయంలో ప్రభుత్వానికి సూచనలు చేయడం మాని నిత్యం విమర్శలు చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.