తెలంగాణచౌక్, మార్చి 27: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సమయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగరంలోని సీపీఐ కార్యాలయంలో ( బద్దం ఎల్లారెడ్డి) భవనంలో జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సమావేశ రాష్ట్ర సమితి సభ్యుడు మర్రి వెంకటస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ సర్కారు అధికారం చేపట్టాక రాష్ర్టాల హక్కులను హరిస్తున్నదని చెప్పారు. సంఖ్యాబలంతో పార్లమెంట్లో చర్చలు జరుపకుండానే బిల్లులను ఆమోదించుకుంటున్నట్లు ఆరోపించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అనే నినాదంతో కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఏప్రిల్ 6న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పోరాటాలతో సాధించుకున్న తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదని, రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరు అవమానించే విధంగా ఉందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై రాష్ట్ర ప్రభుత్వ పోరాటం చేస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు శంకర్, జిల్లా కార్యదర్శి పొనగంటి కేదారి, సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్కుమార్, కార్యవర్గ సభ్యుడు టేకుమల్ల సమ్మయ్య, నగర కార్యదర్శి సురేందర్రెడ్డి, సదాశివ తదితరులు పాల్గొన్నారు.