హిమాయత్ నగర్, డిసెంబర్ 29: చేనేత పరిశ్రమపై విధించిన జీఎస్టీని ఎత్తివేయాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం సాయంత్రం నారాయణ గూడలోని పద్మశాలి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడు తూ సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకోవడంతో పాటు జీఎస్టీ నుంచి చేనేతకు మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీష్రావు పలుమార్లు కేంద్రమంత్రికి లేఖలు రాశారని గుర్తు చేశారు. కట్టుకునే వస్ర్తాలపై పన్ను వేయడం అన్యాయమని, పన్నులు వేయడం వల్ల చేనేత వృత్తి కనుమరుగు అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 2022 జనవరి 5వ తేదీన జరిగే హ్యాండ్లూమ్ మార్చ్కు మద్దతు ఇచ్చి పాల్గొంటామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని చేనేత రంగానికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని, లేని పక్షంలో బలమైన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఆప్కో మాజీ చైర్మన్ గడ్డం జగన్నాథం, అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం జాతీయ అధ్యక్షుడు యర్రమాద వెంకన్న, కందగట్లస్వామి, అవ్వారి భాస్కర్, నాయకులు వనం దుశ్యంతల, శంకరయ్య, గాజుల సత్యనారాయణ పాల్గొన్నారు.