రాష్ట్ర క్రీడా, అబ్కారి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
రాష్ట్ర క్రీడా పాఠశాలలో మంత్రి మల్లారెడ్డితో కలిసి హెల్త్ క్యాంప్ ప్రారంభం
శామీర్పేట, డిసెంబర్ 4: తెలంగాణ రాష్ర్టాన్ని క్రీడా హబ్గా మార్చడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర క్రీడా, అబ్కారి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మేడ్చల్ జిల్లా తూంకుంట మున్సిపల్ హకీంపేటలోని తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలో మంత్రి మల్లారెడ్డితో శనివారం కలిసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే క్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాల పని చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి నాణ్యమైన, పౌష్టికాహారంతో పాటు విద్యను అందిస్తూ క్రీడలలో ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. క్రీడా ప్రతిపాదికన ఉద్యోగాలలో 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు వివరించారు. 9 కోట్లతో క్రీడా పాఠశాల అభివృద్ధికి, 13 కోట్లతో పాఠశాల ప్రాంగణం చుట్టూ కంచె ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం, పాఠశాలలోని 350 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఇన్డోర్ స్టేడియం స్పోర్ట్స్కు సంబంధించి వివిధ ప్రదర్శనలను విద్యార్థులు చేపట్టారు. జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆర్టీసీ సంస్థకు కేటాయించిన స్థలంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని జేఎంసీ కార్పొరేటర్ నిహారిక మంత్రులకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సాట్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, అడ్మినిస్ట్రేటీవ్ అధికారి సుజాత, స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ డాక్టర్ హరికృష్ణ, తూంకుంట మున్సిపాలిటీ చైర్మన్ కారంగుల రాజేశ్వర్రావు, వైస్ చైర్మన్ వాణి వీరారెడ్డి, జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేటర్ నిహారిక, కౌన్సిలర్లు, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, ప్రిన్సిపల్ ప్రకాశ్, క్రీడాకారి ఆర్కే బోస్, మెడివిజన్ వైద్యాధికారి డాక్టర్ ప్రేమ్ కుమార్, కోచ్లు, విద్యార్థులు, పాల్గొన్నారు.