మల్కాజిగిరి, నవంబర్ 16: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నా మని.. నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం మల్కాజిగిరి నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా విజయకుమారిని నియమిస్తూ నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధికోసం కృషి చేస్తున్న వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందన్నారు. ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. వృద్ధులు, వితంతు వులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు నెలనెలా పింఛన్ అందజేస్తున్నదని అన్నారు. ముఖ్యమంత్రి పింఛన్దారుల వయస్సును 57కు తగ్గించారని.. అర్హులైన వారిని గుర్తించి వారిపేర్లను అధికారులకు తెలపాలని నాయకులకు సూచించారు. పేద కుటుంబాల్లోని ఆడపిల్ల పెండ్లికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకంలో రూ.1,01,116 ల అర్థిక సహాయం ప్రభుత్వం అందజేస్తున్నదని, వివాహం తర్వాత పెండ్లి పత్రిక, పెండ్లి ఫొటోను జతచేసి దరఖాస్తుచేసిన వెంటనే చెక్కులు అందజేస్తున్నా మని అన్నారు. మహిళలకు స్వయం ఉపాధి కోసం కుట్టు శిక్షణ ఇప్పిస్తున్నామని, మహిళ గ్రూపులకు బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో భాగ్యవతి, సుమలతయాదవ్, బబిత, సునీత, స్వప్న, పద్మిని, పుణ్యవతి, శశికళ, నితగ్లోరి, లక్ష్మి, సంతోష్రాణి, రజిత, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.