తెలంగాణలో తెలుగు సాహిత్యానికి వన్నెలు దిద్దిన కవి పండితులు విలసిల్లిన సంస్థానాలలో దోమకొండ సంస్థానం ఒకటి. క్రీ.శ.15వ శతాబ్దం మొదలుకొని 20వ శతాబ్దం దాకా ఈ సంస్థానం కామారెడ్డి జిల్లా కేంద్రానికి 20 కిలో మీటర్ల దూరంలో ఉంది. నాటి వైభవానికి చిహ్నంగా నేటికీ ప్రాచీన కట్టడాలతో నిలిచి ఉన్నది.
ఈ సంస్థాన పాలకులు పాకనాటి రెడ్డి శాఖకు చెందినవారు. రాచుళ్ల గోత్రీకులు. కామినేని వంశ సంభవులు. ఈ వంశ పూర్వపురుషుడు కామినీడు పేరుతో ఈ వంశానికి
ఈ పేరు సార్థకమైంది.
ఈ వంశంలో ఏడవ తరానికి చెందిన రెండవ మల్లారెడ్డి కవిగా, కవి పండిత పోషకునిగా కీర్తి గడించాడు. ఇతని కాలం క్రీ.శ. 1535-1600 మధ్య అని విమర్శకుల అభి ప్రా యం. ఈ కవి సంస్కృతాంధ్ర భాషలలో అనేక గ్రంథాలు రచించినట్లు ఇతని ‘శివధర్మోత్తరం’ వల్ల తెలుస్తున్నప్పటికీ, మూడు మాత్రమే లభ్యమైనాయి. వీటిలో మొదటిది ‘షట్చక్రవర్తి చరిత్ర’ రెండవది ‘శివధర్మోత్తరం’, మూడవది ‘పద్మపురాణం’.
షట్చక్రవర్తి చరిత్రలో 1521 పద్యాలతో 8 ఆ శ్వాసాలున్నాయి. హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యుడు అనే ఆరుగురు చక్రవర్తుల కథలు ఇందులో ఉన్నా యి. హరిశ్చంద్రుని సత్యవాక్య పాలనకు ప్రతీకగా నిలిచే మొదటి కథలో మల్లారెడ్డి తన ఇష్టదైవం, కులదైవం అయిన బిక్కనూరు సిద్ధరామేశ్వరుణ్ణి ఎంతో భక్తితో స్మరించాడు.
‘రంగర్భుజంగ భోగా
భంగుర మణి కిరణ వరణ బాలా తపస
త్సాంగత్యారుణితవిభా
లింగితతను సిద్ధరామలింగంబునకున్
ఈ పద్యంలో మల్లారెడ్డికి గల సంస్కృత భాషా వైదుష్యం ప్రస్ఫుటమౌతుంది. అయోధ్యాపుర వర్ణనలో ఈ రమణీయ పద్యం చూడండి
‘గోపుర గోపుర గోపుర ప్రతిమంబు
కల్పద్రు కల్పద్రు గౌరవంబు
మానవ మానస మానవాధినయంబు
మణిజాల మణిజాల మంజిమంటు
సారంగ సారంగ సారంగ నయనంబు
సుమనోబ్జ సుమనోబ్జ శోభితంబు’
ప్రథమాశ్వాసాంతంలో శబ్ద పునరావృత్తి రూపంలో చెప్పిన ఈ యమకం పంచచామర వృత్తంలో శ్రవణ మధురం చేసింది.
భవాభవా భవానుభావ భావజారి భూరిగో
భవా భవాహనే హగేహబాహబాహవాధికా
నవాహవంజ వాహనోద నాదమేదురాధగా
శివాశివాంతరంగసంగ సిద్ధరామలింగమా!
విధివశాత్తు తాను, తన కుటుంబం వనవాసా లపాలై కష్టకాలంలో ఉన్న సందర్భంలో హరిశ్చంద్రుడు తన భార్య పడుతున్న అగచాట్లను చూసి, ఎంతో ఆవేదనతో పలికిన మాటలు మల్లారెడ్డిలోని కారుణ్యాన్ని చాటుతాయి.
‘జీర్ణమై భూతసంకీర్ణమైన గృహంబు
రత్నసౌధమె నీకు రాజవదన?
ఘోరమై బహుమృగా గారమౌ విపినంబు
కేళీవనమె నీకు గిసలయోష్ఠి?
తప్తమై శర్కరా వ్యాప్తమౌ కుతలంబు
కుసుమతల్పమె నీకు కుందరదన?
భారమై వాతానుసారమౌ పెన్ధూళి
కుంకుమ రజమె నీకును లతాంగి?
అక్షరాభ్యాసం చేసే వేళలో బ్రహ్మదేవుడు ఆకా శాన్ని పలకగా తీర్చిదిద్దాడనీ, ఆ పలకపైన సుద్ద ముక్కలతో రాసిన అక్షరాల వలె నక్షత్రాలు వెలుగుతున్నాయని మల్లారెడ్డి వర్ణిస్తాడు.
అక్షరాభ్యాసమొనరించునట్టి వేళ
బంకరుహసూతి నభమను పలకమీద
సుద్ద చేబట్టి వ్రాసిన సున్నలనగ
సలలిత స్ఫూర్తి, నక్షత్రములు వెలింగె
దమయంతికి వివాహాలంకరణ చేసే సందర్భం లో మల్లారెడ్డి ఎంతటి ఆభరణ సౌందర్యాన్ని ఆవిష్కరించాడో చూడండి-
అంబరంబొక భామ యతివకు గట్టె బ
యోధరాకార నిరోధకముగ
నంజనంబొక లేమ మంజువాణికి దీర్చె
ఘన సువర్ణ ప్రభల్ గనుపడంగ
దిలకంబునొక యింతి చెలికి గస్తురి దిద్దె
నల దమయంతుల వివాహానంతరం తొలి రేయి భర్తతో సమాగమానికి కేళీగృహానికి వెళ్తున్న సమయంలో దమయంతి మన్మథునితో పోరు సలుపడానికి వెళ్తున్న వీరవనితలా ఉన్నదని మల్లారెడ్డి వర్ణించిన తీరు అద్భుతంగా ఉంది.
మగని వీక్షించి దేహళీ మధ్యసీమ
ద్రపయు వెనుకకు, ప్రేమముందరికి దిగువ
భామ గనుపట్టె నాలీఢ పాదయగుచు
మరునితో బోర నిలుచున్న మహిమ మెరయ’
దమయంతిని అత్తవారింటికి పంపే సమ యంలో పెద్దలు ఆమెకు చేసిన ఉపదేశాలు శకుంతలను అత్త వారింటికి పంపే సమయంలో కణ్వుడు చేసిన ఉపదేశాన్ని తల పిస్తున్నది.
అత్తమామల యాజ్ఞ యావంత గడువక
మనసురా నడువుమీ మందయాన!
పెనిమిటి యాజ్ఞలోననె ప్రవర్తింపుమీ
ప్రతివాక్యమాడక పంకజాక్షి!
తోడికోడండ్ర వంతులు చూపకతి భక్తి
గలసి మెలంగుమీ కంబుకంఠి!
బంధువర్గంబుల పట్టున వినయంబు
వెలయ భాషింపుమీ నలినగంధి!
సగర చక్రవర్తి కథలో మల్లారెడ్డి చేసిన శరదృతు వర్ణన ఎంతో మనోహరం
దుష్కవియునుబోలె దుహిననిపాతవై
ఖరులన్ని దిక్కుల గలయ నుంచి
కుటిల భూపతి వలె గువలయకమలాభి
వృద్ధిదుర్వ్యాపార విధినడంచి
యాతతాయి వలెనె యుతులితదోషాతి
శయములోక మెరుంగ సంతరించి
కాకోదరుడు వలె ఘన కంచుకంబులు
లలినచ్చటచ్చట వెలయనించి
బహుళ పానీయశాలలు పాడుచేసి
తాళవృంత కదంబముల్ మూలకదిమి
యుల్లములు తల్లడిల్లంగ నుల్లసద్ధ
నాంతికంబుగు చెంత హేమంతమదిరె!!
సగర చక్రవర్తి కథలో మల్లారెడ్డి చేసిన గంగా ప్రార్థన రమణీయం
గంగాయై నిజతోయమజ్జదఘు పంకక్షాళనాం భోలస
ద్భంగాయై జవనానిలోద్ధిత బృహత్కల్లోల హల్లీసకో
ద్గంగాయై కనకాబ్జ గంధలహరీతంతన్యమానా భ్రమ
ద్భృంగాయై భవతే నమోస్తు ఘనమూర్తే ! దేవతాదీర్ఘికే!
ఇలా కామినేని మల్లారెడ్డి తెలంగాణ ప్రాచీన పద్యకావ్య జగత్తులో అనుప మ రత్నంలా భాసిల్లాడు. తాను రాజై కూడా కవిగా రాణించి రాజకవి కావడమే గాక, కవులలోనూ రాజులా తన ఠీవిని ప్రదర్శించి కవి రాజుగా కీర్తి గడించాడు. ఈ విధంగా మల్లారెడ్డి తెలంగాణ లోని తన సంస్థానాన్ని భువన విజయ సామ్యంగా నిలిపాడు!v
కార్తవీర్యుని కథలో మల్లారెడ్డి చేసిన వనవర్ణనలో
వనాన్ని రతాంతసతీ సామ్యంగా భావించిన తీరు స్పృహణీయం
వాడిన దేహవల్లులును వక్రములైన నఖవ్రణం బులున్
గూడిన పత్రజాలములు కుల్కెడి ఘర్మ మరం దబిందువుల్
వీడిన కేశభృంగములు వింతలుగా విలసిల్లుచుండగా
జూడదగెన్ రతాంతసతి చొప్పున నవ్వనియప్పుడొప్పగన్
డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ: 94404 68557