కీవ్, ఫిబ్రవరి 27: రష్యా బలగాలతో ఉక్రెయిన్ సైన్యం హోరాహోరిగా తలపడుతున్నది. సామాన్య పౌరులు సైతం వీధుల్లోకి వచ్చి పోరాటాన్ని సాగిస్తున్నారు. రష్యా యుద్ధ ట్యాంకులను అడ్డుకొంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం రష్యా బలగాలు ఉక్రెయిన్లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కీవ్లోకి ప్రవేశించాయి. నగరాన్ని హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నించాయి. ఒక సమయంలో నగరాన్ని స్వాధీనం చేసుకొన్నట్టు ప్రకటించాయి. అయితే, ఉక్రెయిన్ సైన్యం వీరోచిత పోరాటంతో వారి ప్రయత్నం విఫలమైంది. ఉక్రెయిన్ సేనలదాటికి ఖార్కీవ్ నుంచి రష్యా బలగాలు తోకముడిచాయి. దీంతో ఖార్కీవ్ పూర్తిగా ఉక్రెయిన్ సైన్యం నియంత్రణలోనే ఉన్నట్టు ప్రాంతీయ గవర్నర్ తెలిపారు. ఇక్కడి పోరాట దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలతో పాటు పోర్టులపై కూడా రష్యా దృష్టి పెట్టింది. ఆదివారం దక్షిణ ఉక్రెయిన్లోని రెండు కీలక పోర్టులను స్వాధీనం చేసుకొన్నది. కీవ్ సమీపంలోని వాసిల్కోవ్ వద్ద ఒక చమురు డిపోను రష్యా సేనలు పేల్చేశాయి. మరోచోట గ్యాస్ పైప్లైన్ను పేల్చాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. దక్షిణ ప్రాంతంలోని మరో నగరం నోవా కఖోవ్కాను స్వాధీనం చేసుకొన్నట్టు రష్యా సేనలు ప్రకటించుకున్నాయి.
యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి ఇప్పటివరకు 3.68 లక్ష మంది వలస వెళ్లారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఉక్రెయిన్ శరణార్థులను వీసా లేకుండానే పోలాండ్ అనుమతిస్తున్నది. విదేశాలకు వలస వెళ్తున్నవారితో ఉక్రెయిన్ సరిహద్దులకు జనం పోటెత్తుతున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించించింది. మైళ్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి.
రష్యా దాడుల్లో 210 మంది ఉక్రెయిన్ పౌరులు మరణించారు. 1100 మందికి పైగా గాయపడ్డారు. ఉక్రెయిన్ బలగాల చేతిలో 4,300 మంది రష్యా సైనికులు హతమయ్యారు. ఈ మేరకు ఉక్రెయిన్ రక్షణశాఖ తెలిపింది. కాగా, ఉక్రెయిన్లో శాంతి భద్రతలు క్షీణిస్తుండటంతో ఐరాస, భాగస్వామి సంస్థలు అక్కడ తమ కార్యకలాపాలను తాత్కాలికంగా రద్దు చేసుకొన్నాయి.
రష్యా దాడులను ఆపేలా ఆదేశించాలని కోరుతూ నెదర్లాండ్స్లోని హేగ్లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) ఉక్రెయిన్ ఆశ్రయించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం నుంచి రష్యాను తొలగించాలని కోరింది. ఉక్రెయిన్పై రష్యా దాడుల నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అత్యవసర సమావేశం నిర్వహించింది.