HomeNewsThe Formation Of A Separate State Telangana Started A New Era In The Field Of Irrigation
చివరి ఆయకట్టుకూ తడి
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ సాగునీటి రంగంలో నవశకం ఆరంభమైంది.
రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల రికార్డు
భారీగా పెరుగుతున్న నీటి వాడకం
ఉమ్మడిపాలనలో రెండు సీజన్లలో 30 టీఎంసీలు దాటని దైన్యం
కేసీఆర్ వ్యూహాత్మక ప్రణాళికలు
వినూత్న యాజమాన్య పద్ధతులు
నేడు ఒకే సీజన్లో 330 టీఎంసీలు
ఎనిమిదేండ్లలో సమూల మార్పులు
హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ సాగునీటి రంగంలో నవశకం ఆరంభమైంది. చరిత్రాత్మక ప్రగతిని సాధిస్తూ మున్ముందుకు దూసుకుపోతున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వం లో యుద్ధప్రాతిపదికన నిర్మాణవుతున్న ప్రాజెక్టులు ఒకవైపు, క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న వినూత్న నీటి యాజమాన్య పద్ధతులు మరోవైపు వెరసి ప్రాజెక్టుల కింద ఆయకట్టు విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నది. ప్రాజెక్టుల నిర్మాణం, వాటి నిర్వహణలో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతుండటంతో ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టడమేగాక అంతేస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నది. ఉమ్మడి పాలనలో గోదావరి, కృష్ణా నదీజలాల కేటాయింపుల్లో రెండు సీజన్లకూ కలిపి నీటి వినియోగం గరిష్ఠంగా 300 టీఎంసీలు దాటిన దాఖలాలు లేవు.
ప్రస్తుతం ఈ ఏడాది ఒక్క యాసంగి సీజన్లోనే 330 టీఎంసీలకు మించి నీటిని వినియోగించుకునే స్థాయికి చేరడం తెలంగాణ సాధించిన ప్రగతికి అద్దంపడుతున్నది. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గడచిన ఎనిమిదేండ్ల కాలంలో సాగునీటి వసతుల కల్పనలో 76.92శాతం వృద్ధి నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. దేశవ్యాప్తంగా అత్యధికంగా వ్యవసాయానికి సాగునీటి వసతి కలిగిన రాష్ర్టాల్లో తెలంగాణ టాప్ టెన్లో నిలువడం గర్వకారణం.
ప్రాజెక్టుల కొత్త చరిత్ర..
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడంతోపాటు కాలువల ఆధునికీకరణ పనులను యుద్ధప్రతిపాదికన చేపట్టారు. మరోవైపు కాళేశ్వరం ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టడంతోపాటు అందులో భాగంగా అనేక రిజర్వాయర్లను నిర్మించారు. వాటిని చెరువులకు అనుసంధానం చేసి, నీటి తో నింపుతున్నారు. ఎల్లంపల్లి, మధ్యమానేరు, అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మలాంటి పలు నూతన రిజర్వాయర్లు సైతం అందుబాటులోకి రావడంతో రాష్ట్రంలో నీటి నిల్వసామర్థ్యం గణనీయంగా పెరిగింది.
ప్రాజెక్టులతో అనుసంధానించడంతో నిజాంసాగర్, సింగూరుతోపాటు కుమ్రంభీం, నల్లవాగు, రామప్ప, లక్నవరం, సుద్దవాగు, వట్టివాగు, నీల్వాయి, కౌలాస్నాలా తదితర దాదాపు 40కిపైగా మధ్య,చిన్న తరహా ప్రాజెక్టులకు నీటి భరోసా లభించింది. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాజెక్టుల కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద వానకాలం, యాసంగి రెండు సీజన్లకు కలిపి గరిష్ఠంగా సాగునీటి సరఫరా 60 లక్షల ఎకరాలు కూడా దాటని దుస్థితి. చాలా ప్రాజెక్టుల కింద యాసంగి సాగు అనే మాటే వినిపించకపోయేది.
యాసంగిలో మొత్తంగా 10 లక్షల నుంచి 15 లక్షల ఎకరాలకు మించి సాగునీరు అందించిన దాఖలాలు లేవు. అదీ కూడా ఆరుతడి పంటలకే కావడం గమనార్హం. కానీ తెలంగాణ రాష్ట్రంలో మూడేండ్లుగా భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద రెండు సీజన్లకు కలిపి 1.20 కోట్ల ఎకరాలకు సాగునీరు అందిస్తుండడం విశేషం. వానకాలంలో ఆయా ప్రాజెక్టుల కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరు అందిస్తుండగా, యాసంగిలోనూ 75 శాతం ఆయకట్టుకు నీరు అందుతున్నది. యాసంగిలో ఏటా దాదాపు 35 లక్షలకుపైగా ఎకరాలకు మించి సాగునీరు అందుతున్నది. సాగునీటి వినియోగంలో ప్రాజెక్టులు కొత్త చరిత్రను లిఖిస్తున్నాయి.
సగటున ఒక టీఎంసీతో 13 వేల ఎకరాలకు..
నీటిని ఒడిసిపట్టడంతోపాటు ఆ వనరులను సమర్థవంతంగా వినియోగించడంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా కాలువల ఆధునికీకరణ, టేల్ టు హెడ్, ఆన్ అండ్ ఆఫ్ తదితర నీటియాజమాన్య పద్ధతులను అమలు చేస్తున్నది. ఉమ్మడి పాలనలో 1 టీఎంసీ నీటితో కేవలం 4 నుంచి 5 వేల ఎకరాలకు మాత్రమే నీటిని అందించారు. అందుకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న చర్యల ఫలితంగా ఒక టీఎంసీ నీటితో నేడు 10వేల నుంచి 13 వేల ఎకరాలకుపైగా సాగునీరు అందుతుండటం విశేషం. ఫలితంగా తక్కువ నీటితో ఎక్కువ మొత్తంలో ఎకరాలకు సాగునీరు అందుతున్నది. చివరి ఆయకట్టులోని ఆఖరి మడికి సైతం సాగునీటికి ఢోకా లేదు.
ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానం వల్ల పంటల దిగుబడి కూడా గణనీయంగా పెరిగింది. గతంలో శ్రీరాంసాగర్ మొదటి దశ ఆయకట్టుకే పూర్తిగా నీరందని దుస్థితి నుంచి నేడు ఎస్సారెస్పీ రెండో దశలోని చివరి ఆయకట్టుకు సైతం నీరందించే స్థాయికి చేరుకొన్నాం. గతంలో యాసంగిలో కేవలం ఆరుతడి పంటలకే ప్రాజెక్టుల కింద సాగునీరు అందగా, నేడు తరి పంటలకే అత్యధిక మొత్తంలో నీటిని అందిస్తున్నాం. 2021 -22 యాసంగిలో కేవలం 11.95 లక్షల ఎకరాల వెట్క్రాప్స్కు సాగునీటిని అందించగా, ఈ ఏడాది ఏకంగా 22.32 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. అదే సమయంలో గత ఏడాది దాదాపు 19.81 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకు సాగునీటిని అందించగా, ఈ ఏడాది కేవలం 13.84 లక్షలకు ఎకరాలకు అందించాలని నిర్ణయించారు.