హైదరాబాద్, నవంబర్ 9: టెలికం, ఎల్ఈడీ లైటింగ్ విభాగంలో హైదరాబాద్కు చెందిన రిసొల్యూట్ గ్రూప్నకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్పాదక ప్రోత్సాహకం అందింది. దేశీ తయారీ రంగం కోసం ఉద్దేశించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ను (పీఎల్ఐ) తెలంగాణలో తీసుకున్న తొలి ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఇదేకావడం గమనార్హం. టెలికం నెట్వర్కింగ్ ఉత్పత్తులు, 4జీ, 5జీ టెలికమ్యునికేషన్ ఎక్విప్మెంట్, ఫైబర్ ఆప్టిక్ టెలికమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ తయారీకి రిసొల్యూట్ గ్రూప్ పెట్టుబడులు చేస్తున్నది. అలాగే ఎల్ఈడీ లైటింగ్ విభాగంలో దీర్ఘకాలంగా ఉత్పత్తులు తయారుచేస్తున్న రిసొల్యూట్ ఇకమీదట& ఎల్ఈడీలకంటే విద్యుత్ను ఎక్కువగా ఆదాచేసే స్మార్ట్ లైటింగ్ ఉత్పత్తుల తయారీని ప్రారంభించనున్నది. తమకు స్మార్ట్ లైటింగ్ కోసం పీఎల్ఐ లభించిందని రిసొల్యూట్ చైర్మన్ సింగ్ సోయిన్ చెప్పారు.
పీఎల్ఐతో దేశంలోనే విడిభాగాల లభ్యం…
ఎంతోకాలంగా టెలికం, ఎల్ఈడీ లైటింగ్ పరిశ్రమలో ఉన్నామని, తాజాగా పీఎల్ఐ మంజూరుకావడంతో తదుపరి వృద్ధి దశలో ప్రవేశిస్తామని చైర్మన్ తెలిపారు. ఇప్పటివరకూ ఒక సమగ్ర ఎలక్ట్రానిక్ పరికరాన్ని అసెంబుల్ చేయాలంటే అందులో వాడే 80 శాతం విడిభాగాలను దిగుమతి చేసుకోవాల్సివస్తున్నదన్నారు. ప్రభుత్వం పీఎల్ఐని మంజూరుచేయడంతో దేశంలో విడిభాగాల తయారీ ఊపందుకుంటుందని, తద్వారా అసెంబ్లింగ్కు 40 శాతం విడిభాగాలను దిగుమతి చేసుకుంటే సరిపోతుందని సోయిన్ వివరించారు. తదుపరి రోజుల్లో కేవలం ప్రధాన ఐసీ మినహా ఇతర విడిభాగాలన్నీ దేశంలోనే ఉత్పత్తవుతాయన్నారు.