మహబూబ్నగర్, మే 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్నగర్ పట్టణంలో తొలిసారి స్థిరాస్తి ప్రదర్శన ఏర్పాటైంది. రైల్వే స్టేషన్ రోడ్డులోని సుదర్శన్ కన్వెన్షన్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఏర్పాటు చేసిన ఈ ప్రాపర్టీ షోను జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, ఎస్పీ వెంకటేశ్వర్లు శనివారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పట్టణం రియల్ ఎస్టేట్పాటు అన్ని రంగాల్లో శరవేగంగా పురోగమిస్తున్నదని పేర్కొన్నారు.
సకల సదుపాయాలతో వేగంగా విస్తరిస్తున్న పట్టణం.. భవిష్యత్తులో పెద్ద నగరంగా మారే అవకాశం ఉన్నదని తెలిపారు. ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు స్థిరాస్తి సంస్థలు, బ్యాంకులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి మహబూబ్నగర్లో తొలిసారి ప్రాపర్టీ షోను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఉద్యోగార్థుల కోసం ‘నమస్తే తెలంగాణ’లో నిత్యం ‘నిపుణ’ పేరిట ప్రత్యేక పేజీలు అందించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇతర ఇంగ్లిష్ దినపత్రికలతో పోలిస్తే ‘తెలంగాణ టుడే’ అద్భుతంగా ఉన్నదని ప్రశంసించారు.
కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ కొరమోని నర్సింహులు, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేశ్, క్రెడాయ్ జిల్లా వైస్ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, ‘నమస్తే తెలంగాణ’ బ్రాంచ్ మేనేజర్ రాజశేఖర్, బ్యూరో ఇన్చార్జి విజయ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ విజయ్కుమార్రెడ్డి, సర్క్యులేషన్ మేనేజర్ జగన్ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన స్థిరాస్తి సంస్థలు శ్రీరామ ల్యాండ్ మార్క్, సిరిసంపద గ్రూప్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, దేవాస్ ఇన్ఫ్రా, కామాక్షి స్మార్ట్ సిటీ, స్కంధాన్షి, సీ భాస్కర్ సిమెంట్స్, శ్రీ సిమెంట్స్, రెయిన్బో డెవలపర్స్, ఫార్చ్యూన్ హైట్స్తోపాటు ఎస్బీఐ, కెనారా బ్యాంక్, యూబీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర ఆర్థిక సంస్థలు పాల్గొంటున్న ఈ ప్రాపర్టీ షోకు తొలి రోజే విశేష స్పందన లభించింది.
మహబూబ్నగర్తోపాటు జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట తదితర నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కొనుగోలుదారులు తరలివచ్చారు. ప్రదర్శనలోని స్టాళ్లను సందర్శించి వివరాలను తెలుసుకొన్నారు. బ్యాంకుల్లో గృహ రుణాల వడ్డీ, ఈఎంఐ వివరాలను ఆరా తీసి తమకు అనుకూలంగా ఉన్న ప్లాట్లు, ఇండ్ల కొనుగోలుకు ప్రణాళికలు వేసుకొంటున్నారు.