న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం పెద్ద గందరగోళం సృష్టించారు. ఆటోమొబైల్ ఉత్పత్తిదారులకు, వాహన కొనుగోలుదార్లకు, స్టాక్ మార్కెట్కు ఆందోళన మిగిల్చారు. మంత్రి ఉదయం ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ సియామ్ సదస్సులో మాట్లాడుతూ కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు డీజిల్తో నడిచే వాహనాలపై అదనంగా 10 శాతం పన్ను వేస్తామంటూ ప్రకటించారు. డీజిల్ ఉపయోగించే వాహనాలపైనే కాకుండా ఆ ఇంధనంతో నడిచే జనరేటర్ సెట్స్పై కూడా అదనపు జీఎస్టీగా 10 శాతం కాలుష్య పన్ను విధించాలంటూ తాను ఆర్థిక మంత్రిని కోరతానన్నారు. అటుతర్వాత ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద అటువంటి ప్రతిపాదన ఏదీ లేదంటూ మాటమార్చారు.
ఆర్థిక మంత్రితో సమావేశమవుతా
కాలుష్యం పెరుగుదల ఆరోగ్యాలపై దుష్ప్రభావాన్ని చూపిస్తుందని, ఈ కారణంగా డీజిల్ వాహనాల వాడకాన్ని నిరుత్సాహపర్చడానికి పన్నులు పెంచాల్సి ఉందని సదస్సుకు తెలిపారు. ‘ డీజిల్ ఇంజిన్లు/వాహనాలపై 10 శాతం అదనపు జీఎస్టీ విధించాలని ఆర్థిక మంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, డీజిల్ బండ్లను క్రమేపీ తొలగించాలంటే ఇదొక్కటే మార్గం’ అని చెపుతూ తాను ఈ అంశంపై రాసిన లేఖను ఇచ్చేందుకు ఆర్థిక మంత్రితో సమావేశమవుతానంటూ తెలిపారు. వెనువెంటనే మీడియాలో ఈ వార్త శరవేగంగా వ్యాపించిపోయింది. దీంతో సదస్సు ముగిసిన తర్వాత ట్విట్టర్ (ఎక్స్)లో గడ్కరీ ఒక పోస్టు చేస్తూ ‘అటువంటి ప్రతిపాదన (అదనపు పన్ను విధింపు) ఏదీ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో లేదు’ అని వివరించారు.
మార్కెట్లో డీజిల్ కార్లు అమ్మవద్దు
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) సదస్సులో మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగిస్తూ డీజిల్ వాహనాల్ని అమ్మడం కష్టతరమయ్యేలా ప్రభుత్వం పన్నుల్ని భారీగా పెంచుతుందన్నారు. దేశంలో ప్రస్తుతం అధికశాతం వాణిజ్య వాహనాలు డీజిల్తో నడుస్తున్నవే. పాసింజర్ వాహనాలకు సంబంధించి మారుతి సుజుకి, హోండాతో సహా వివిధ కంపెనీలు ఇప్పటికే డీజిల్ కార్ల తయారీని నిలిపివేశాయి. దేశంలో డీజిల్ కార్ల వాడకం గణనీయంగా తగ్గిందని, ఉత్పత్తిదారులు వాటిని మార్కెట్లో విక్రయించరాదని గడ్కరీ సూచించారు.
రవాణా రంగంలో అధిక శాతం డీజిల్, పెట్రోల్తోనే నడుస్తున్నాయని, ఇందుకు ప్రత్నామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు తోడు బయో ఫ్యూయల్స్, ఇథనాల్, గ్రీన్ హైడ్రోజన్లపై దృష్టి నిలపాలన్నారు. ‘డీజిల్కు గుడ్బై చెప్పండి. వాటిని తయారు చేయకండి, లేదంటే డీజిల్ వాహనాల్ని మీరు అమ్మడానికి కష్టమయ్యేంతగా పన్నులు పెంచేస్తాం’ అని ఆటో కంపెనీలను హెచ్చరించారు. ప్రస్తుతం ఆటోమొబైల్స్పై 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఇందుకు అదనంగా ఆయా వాహనరకాల ప్రకారం 1 శాతం నుంచి 22 శాతం వరకూ సెస్ విధిస్తున్నారు. ఎస్యూవీలకు అత్యధికంగా 28 శాతం జీఎస్టీ, 22 శాతం సెస్ ఉంది.