హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ ఫీజులపై తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) చేపట్టిన కసరత్తు ముగిసింది. తుది విచారణను అధికారులు సోమవారం పూర్తిచేశారు. 173 కాలేజీలకు ఫీజులను సిఫారసు చేస్తూ మంగళవారం ప్రభుత్వానికి నివేదిక పంపించనున్నారు. ఈ నివేదికను ప్రభుత్వం ఆమోదించి జీవోను జారీచేస్తే.. ఆయా ఫీజులు 2023-25 బ్లాక్ పీరియడ్కు అమలుకానున్నాయి. గతంలో టీఏఆఫ్ఆర్సీ ఖరారుచేసిన ఫీజులపై 20 వరకు కాలేజీలు అభ్యంతరం వ్యక్తంచేశాయి.
ఆయా కాలేజీలపై సోమవారం టీఏఎఫ్ఆర్సీ విచారణ చేపట్టింది. సీబీఐటీ, నారాయణమ్మ, మల్లారెడ్డి, అనురాగ్ తదితర 16 కాలేజీలపై విచారణ జరిపారు. ఈ సందర్భంగా పలు కాలేజీలు తమ అభ్యంతరాలను కమిటీ ముందుంచాయి. ఖర్చుల్లో వాటర్చార్జీలు, విద్యుత్తు బిల్లులను పరిగణనలోకి తీసుకోవాలని కోరాయి. ఇక సీట్ల ఇన్టేక్ను బట్టి ఫీజులను ఖరారుచేయాలని ఓ కాలేజీ యాజమాన్యం కోరినట్టు తెలిసింది. తమ కాలేజీని ఏఐసీటీఈలో 240 సీట్లకు అనుమతిస్తే.. తాము 120కి తగ్గించుకున్నామని.. ఆయా సీట్ల ప్రకారమే ఫీజులను పరిగణనలోకి తీసుకోవాలని వాదనలు వినిపించింది.