ముంబై, ఏప్రిల్ 27: భారతీయ రిటైల్ పరిశ్రమ రూ.153 లక్షల కోట్లకు (దాదాపు 2 లక్షల కోట్ల డాలర్లు) చేరుకోవచ్చని ఓ తాజా నివేదిక అంచనా వేసింది. దేశంలో కరోనా ప్రభావ పరిస్థితులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో 2032 నాటికి ఈ స్థాయిని తాకుతుందని బీసీజీ-రాయ్ (రిటైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) రిపోర్టు చెప్తున్నది. ‘రేసింగ్ టువర్డ్స్ ది నెక్స్ వేవ్ ఆఫ్ రిటైల్ ఇన్ ఇండియా’ పేరుతో వచ్చిన ఈ నివేదిక ప్రకారం వచ్చే పదేండ్లలో వార్షిక వృద్ధి 10 శాతంగా ఉండొచ్చని అంటున్నారు. ఈ క్రమంలోనే దాదాపు 2 లక్షల కోట్ల డాలర్లకు ఇండియన్ రిటైల్ ఇండస్ట్రీ వెళ్లవచ్చని అంచనా వేస్తున్నారు.
కిరాణా, ఆహార, రెస్టారెంట్లు, క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (క్యూఎస్ఆర్), కన్జ్యూమర్ డ్యూరబుల్స్ వంటి వ్యాపారాలు కరోనా ప్రభావం నుంచి బయటపడ్డాయని ఈ సందర్భంగా బీసీజీ-రాయ్ తమ నివేదికలో తెలిపింది. అయితే ఆభరణాలు, దుస్తులు, పాదరక్షల వంటి వ్యాపారాలు ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోవాల్సి ఉందని పేర్కొన్నది. ‘దేశ ఆర్థిక వ్యవస్థలో వినియోగ సామర్థ్యం పెరుగుతూపోతున్నది. ఇది కరోనాకు ముందున్న స్థాయికి చేరుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి’ అని బీసీజీ ఎండీ, సీనియర్ భాగస్వామి అభీక్ సింఘీ అన్నారు. ఈ క్రమంలోనే రాబోయే దశాబ్దకాలంలో భారతీయ రిటైల్ పరిశ్రమలోని సంస్థాగత వ్యాపారులు అటు ఆఫ్లైన్, ఇటు ఆన్లైన్లో బలోపేతం కాగలరన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
2026 నాటికి దేశంలో ఈ-కామర్స్ వ్యాపారం రూ.10 లక్షల కోట్లకు (130 బిలియన్ డాలర్లు) చేరవచ్చని ఈ సందర్భంగా బీసీజీ-రాయ్ నివేదిక అంచనా వేసింది. 2021లో 45 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు తెలిపింది. కరోనాకు ముందు దేశంలో వినియోగ సామర్థ్యం రేటు 12 శాతంగా ఉన్నది. కరోనా సమయంలో ఇది బాగా పడిపోగా, ఇప్పుడు 17 శాతానికి ఎగబాకినట్టు తాజా రిపోర్టు చెప్తున్నది. ఈ క్రమంలోనే దేశీయ రిటైల్ పరిశ్రమపై అంచనాలు భారీగా పెరిగాయి. కాగా, రిటైల్ మార్కెట్లోని పరిస్థితులు, మార్పులు, వ్యాపారం, వ్యాపారుల అభిప్రాయాల ఆధారంగా ఈ రిపోర్టు తయారైంది.
దేశంలో కరోనా ప్రభావ పరిస్థితులు దాదాపు కనుమరుగైన నేపథ్యంలో కొనుగోలుదారులు మళ్లీ దుకాణాల్లోకి వస్తున్నారని ప్రముఖ రిటైలర్ షాపర్స్ స్టాప్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) రిటైల్ ఇండస్ట్రీ గతంతో పోల్చితే ఆకర్షణీయ వృద్ధిరేటునే నమోదు చేయవచ్చన్న అభిప్రాయాన్ని ఆ సంస్థ ఎండీ, సీఈవో వేణు నాయర్ వ్యక్తం చేశారు. గడిచిన 2 నెలలుగా కొనుగోలుదారుల తాకిడి దుకాణాలకు పెరిగిందని, ఇది ఇలాగే ఉంటుందన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు. ఆఫ్లైన్ మార్కెట్లో కొంత స్తబ్ధత ఉన్నా.. ఆన్లైన్ మార్కెట్ హవా కొనసాగుతుందన్నారు.