కావలసిన పదార్థాలు
పనీర్ ముక్కలు: ఒక కప్పు, కార్న్ఫ్లోర్: పావుకప్పు, మైదా: ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, పచ్చిమిర్చి: రెండు, ఎండు మిర్చి: రెండు, కారం: ఒక టీస్పూన్, జీలకర్ర, ధనియాల పొడి: ఒక టీస్పూన్, గరం మసాల: అర టీస్పూన్, పెరుగు: పావుకప్పు, రెడ్ ఫుడ్ కలర్: నాలుగు చుక్కలు, కరివేపాకు: రెండు రెబ్బలు, కొత్తిమీర తురుము: కొద్దిగా, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం
పనీర్ ముక్కలను పది నిమిషాలపాటు గోరువెచ్చని నీళ్లలో నానబెట్టాలి. ఒక గిన్నెలో పనీర్ ముక్కలు, మైదా, కార్న్ఫ్లోర్, పావు టీస్పూన్ ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు చల్లి బాగా కలపాలి. స్టవ్మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి, వేడయ్యాక పనీర్ ముక్కలను విడివిడిగా వేసి దోరగా వేయించాలి. స్టవ్మీద పాన్పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి తురిమిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించాలి. అన్నీ బాగా వేగాక ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాల, కారం, తగినంత ఉప్పు, పెరుగు, ఫుడ్కలర్ వేసి బాగా కలిపి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. వేయించి పెట్టుకున్న పనీర్ ముక్కలు వేసి ఎక్కువ మంటమీద మరో రెండు నిమిషాలు వేయిస్తే పనీర్-65 సిద్ధం.