కొలంబో, మార్చి 20: శ్రీలంక ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరింది. కనీసం ఆహార పదార్ధాల దిగుమతులకు కూడా విదేశీ మారక నిల్వలు లేక, అవసరమైనంత అప్పు పుట్టక ఆ దేశం అల్లాడుతున్నది. గోరు చుట్టు రోకటి పోటులా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పరిస్థితిని మరింత దిగజార్చింది. దీంతో ఆహార ధరలు ఆకాశాన్ని తాకాయి. శ్రీలంకలో అక్కడి కరెన్సీ ప్రకారం ప్రస్తుతం ఒక్క గుడ్డు ధర రూ.35, కిలో చికెన్కు రూ.వెయ్యి. శ్రీలంకలో ద్రవ్యోల్బణం ఎంతగా పెరిగిపోయిందో చెప్పడానికి ఈ ధరలే నిదర్శనం. ధరలు ఇంకా పెరగవచ్చని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దుకాణాలు, పెట్రోల్ బంకుల ముందు జనం భారీ క్యూలు కడుతున్నారు. పెట్రోల్ కోసం బంక్ దగ్గర ఏడు గంటలకు పైగా నిలబడి ఇద్దరు వృద్ధులు కన్నుమూశారు. శ్రీలంకలో ప్రస్తుతం 400 గ్రాముల పాలపొడి ధర రూ.250గా ఉంది. కప్పు టీ రూ.100. లీటరు పెట్రోల్ ధర రూ.283, డీజిల్ ధర రూ.176గా ఉంది. పేపర్ దిగుమతి చేసుకోవడానికి డబ్బు లేక దేశవ్యాప్తంగా పాఠశాలల్లో పరీక్షలను రద్దు చేశారు.