ముంబై, సెప్టెంబర్ 29: దేశంలో విదేశీ మారకపు నిల్వలు మరింతగా పడిపోయాయి. ఈ నెల 22తో ముగిసిన వారంలో మరో 2.335 బిలియన్ డాలర్లు క్షీణించాయి. దీంతో 590.702 బిలియన్ డాలర్లకు దిగజారాయి. ఈ మేరకు శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ తెలియజేసింది. అంతకుముందు వారంలోనూ ఫారెక్స్ నిల్వలు 867 మిలియన్ డాలర్లు పతనమైన విషయం తెలిసిందే. ఇక ఆపై వారం రోజుల్లోనైతే ఏకంగా 4.99 బిలియన్ డాలర్లు హరించుకుపోయాయి. దీంతో ఈ నెల 1 నుంచి 22 వరకు 8 బిలియన్ డాలర్లకుపైగానే దేశంలోని విదేశీ మారకపు నిల్వలు కరిగిపోయాయని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది.
తీవ్ర ఒత్తిడిలో..
భారతీయ ఫారెక్స్ రిజర్వులు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడినే ఎదుర్కొంటున్నాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. 2021 అక్టోబర్లో దేశంలోని విదేశీ మారకపు నిల్వలు రికార్డు స్థాయికి చేరాయి. మునుపెన్నడూ లేనివిధంగా 645 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ అంతకంతకూ పడిపోతుండటం, తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండటం ప్రతికూలంగా మారింది. ఫారెక్స్ రిజర్వులను అడ్డుపెట్టి ఆర్బీఐ రూపాయి నష్టాలను అడ్డుకుంటున్నది మరి. దీంతో రాబోయే రోజుల్లో ఫారెక్స్ నిల్వలు ఇంకా తగ్గవచ్చన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
విదేశీ కరెన్సీ ఆస్తులే..
దేశీయ ఫారెక్స్ రిజర్వుల్లో అత్యధికంగా ఉన్నది విదేశీ కరెన్సీ ఆస్తులే. దీంతో పడిపోతున్న రిజర్వుల్లో వీటి వాటానే ఎక్కువగా ఉంటున్నది. ఈ నెల 15 నుంచి 22 వరకు కోల్పోయిన ఫారెక్స్ నిల్వల్లో ఫారిన్ కరెన్సీ ఆస్తుల వాటా 2 బిలియన్ డాలర్లపైనే. దీంతో మొత్తం భారతీయ ఫారెక్స్ రిజర్వుల్లో ప్రస్తుతం ఫారిన్ కరెన్సీ ఆస్తులు 523.363 బిలియన్ డాలర్లకు దిగివచ్చినట్టు ఆర్బీఐ తమ తాజా వివరాల్లో పేర్కొన్నది. అయితే ఇదే సమయంలో బంగారం నిల్వలు 307 మిలియన్ డాలర్లు పెరిగినట్టు ఆర్బీఐ స్పష్టం చేసింది. దీంతో ఫారెక్స్ రిజర్వుల్లో గోల్డ్ వాటా 44.307 బిలియన్ డాలర్లకు ఎగిసినట్టు వెల్లడించింది.