నేరేడ్మెట్, నవంబర్ 14 : భవిష్యత్తులో ప్రగతి ప్రదాతలు నేటి బాల బాలికలేనని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు. ఆదివారం పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా మల్కాజిగిరి తెలంగాణ సాంస్కృతిక శాఖ, సాహిత్య అకాడమి సౌజన్యంతో అక్షర కౌముది సంస్థ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో విద్యార్థులకు వ్యక్తిత్వ, దేశభక్తి గీతాల పోటీలను అంతర్జాలంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా బాలలకు చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రోత్సహిస్తున్న అక్షర కౌముది సంస్థ సేవలు ప్రసంశనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అక్షర కౌముది సంస్థ అధ్యక్షుడు తులసి వెంకటరమణాచార్యులు, పురిమల్ల సునంద, రమాదేవి, కులకర్ణి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.