హైదరాబాద్, మార్చి 20 ( నమస్తే తెలంగాణ): రాష్ట్ర రైతాంగం పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేవడానికి టీఆర్ఎస్ పార్టీ ఆందోళనలకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ వివక్షకు నిరసనగా అన్ని స్థాయిల్లో నిరసనలకు కార్యాచరణను సిద్ధం చేసింది. వరి కొనుగోలుపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయడానికి సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగనున్నది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులను ఆహ్వానించారు. పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వర్రావు కూడా హాజరుకానున్నారు. సమావేశంలో వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ వైఖరి, తెలంగాణ రైతాంగం పక్షాన చేయాల్సిన పోరాటాలు, నిరసనలపై పార్టీ నాయకులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు నిరసనలు, ఆందోళన చేయడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తేనున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల ఏ విధంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదో బట్టబయలు చేయనున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ విసృ్తతస్థాయి సమావేశం ముగిశాక ఢిల్లీకి బయల్దేరి వెళ్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ కేంద్రంగా ప్రయత్నాలు చేయనున్నారని తెలిపాయి. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ రైతులకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కోరతారని, పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారని వెల్లడించాయి. పార్లమెంటు సమావేశాలు కూడా ఉన్నందున రాష్ట్ర ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారని పేర్కొన్నాయి.