న్యూఢిల్లీ, డిసెంబర్ 6: నాగాలాండ్లో కూలీలపై సైన్యం కాల్పుల ఘటనపై కేంద్రప్రభుత్వం పశ్చాత్తాపం ప్రకటించింది. ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం లోక్సభలో వివరణ ఇచ్చారు. వాహనంలో ఉన్నది తీవ్రవాదులనే అనుమానంతోనే బలగాలు కాల్పులు జరిపాయని తెలిపారు. ఘటనపై దర్యాప్తునకు సిట్ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సిట్ నెల రోజుల్లోగా దర్యాప్తును ముగించి నివేదిక ఇస్తుందని, నిందితులను తప్పకుండా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. మృతుల పట్ల సంతాపం ప్రకటించారు.
వాహనాన్ని ఆపినా ఆగలేదు
శనివారం ఘటన తీరును అమిత్ షా లోక్సభలో వివరించారు. ‘మోన్ జిల్లాలో తీవ్రవాదులున్నారన్న సమాచారంతో సైన్యం ఆపరేషన్ మొదలు పెట్టింది. కూలీలు వస్తున్న వాహనాన్ని సైన్యం ఆపింది. కానీ డ్రైవర్ ఆపకుండా, వేగంగా నడపడానికి ప్రయత్నించడంతో అందులో తీవ్రవాదులు ఉన్నారని సైనికులు అనుమానించారు. కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఆరుగురు పౌరులు చనిపోయారు’ అని చెప్పుకొచ్చారు. పొరపాటును వెంటనే గుర్తించిన సైనికులు.. గాయపడ్డవారిని దవాఖానకు తరలించినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు లోక్సభలో చర్చకు డిమాండ్ చేశాయి. స్పీకర్ అంగీకరించలేదు. విపక్షాలు అసంతృప్తితో వాకౌట్ చేశాయి.
మృతుల కుటుంబాలకు రూ.16లక్షలు
సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్ఎస్పీఏ)ను రద్దు చేయాలని నాగాలాండ్ సీఎం నెయ్ఫ్యూ రియో డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.11 లక్షల పరిహారం ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని ప్రకటించారు.
ఏఎఫ్ఎస్పీఏ ఇష్టం వచ్చినట్టు కాల్చడానికి కాదు
ఏఎఫ్ఎస్పీఏను రద్దు చేయాలని ఈశాన్య రాష్ర్టాల్లో డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. రియో డిమాండ్ను మేఘాలయ సీఎం సంగ్మా కూడా స్వాగతించారు. ఈశాన్య రాష్ర్టాల్లో ఏఎఫ్ఎస్పీఏ చట్టాన్ని రద్దు చేయాలన్నారు. అస్సాంలోని విపక్షాలు కూడా ఏఎఫ్ఎస్పీఏ చట్టం రద్దుకు డిమాండ్ చేశాయి. ‘ఏఎఫ్ఎస్పీఏ చట్టం కారణంగా సైనికులు ఈశాన్య రాష్ర్టాల్లో పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు’ అని ఎన్డీపీపీ ఎంపీ టొకేహో యెప్తోమీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఎఫ్ఎస్పీఏ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో సైన్యం చర్యలకు సాధారణ కోర్టుల నియమాలు వర్తించవు.