హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): గంపెడాశతో ఎదురుచూసినప్పటికీ ఆదాయ పన్ను విషయంలో వేతన జీవులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈసారైనా ఆదాయపు పన్ను రాయితీలు కల్పిస్తారని ఆశించిన ఉద్యోగులకు కేంద్రం మరోసారి మొండిచెయ్యి చూపింది. గతేడాదిలాగే పన్ను మినహాయింపుపై ఎటువంటి ప్రకటన చేయలేదు. వ్యక్తిగత ఆదాయ పన్ను టారిఫ్లపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో వివరాలు వెల్లడించలేదు. దీంతో వేతన జీవులు బడ్జెట్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కరోనా సమయంలో ఆర్థికంగా ఉన్నత వర్గాల ఆదాయం పెరిగినప్పటికీ.. దిగువ, మధ్య తరగతి జీవుల ఆదాయాలు గణనీయంగా తగ్గాయి. దీనికి తోడు ఆరోగ్యంపై ఎక్కువ మొత్తంలో వెచ్చించాల్సి వచ్చింది. ఆదాయపు పన్నుశాఖ వెబ్సైట్ ప్రకారం.. 2021 డిసెంబర్ నాటికి దేశ జనాభాలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు 4.5 కోట్ల మంది (3.4 శాతం) ఉన్నారు. కరోనా సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది.దీంతో సంక్షోభ సమయంలోనూ కచ్చితమైన ఆదాయ మార్గంగా ఉన్న ఆదాయ పన్నులో ఎటువంటి మినహాయింపులు ఇచ్చేందుకు కేంద్రం ఆసక్తి చూపించలేదు.
ఆదాయపు పన్ను శ్లాబులు కానీ, స్టాండర్డ్ డిడక్షన్గానీ, 80సీ పరిమితులను మార్చకుండా యథాతథంగా ఖరారుచేసింది. గత ఏడేండ్లుగా కేంద్రం ఇదే వైఖరిని అనుసరిస్తున్నది. ఏడేండ్ల క్రితంనాటి కనీస ఆదాయ పరిమితినే ఇంకా కొనసాగిస్తున్నది. ఉద్యోగుల ఆదాయ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచాలని జాతీయస్థాయిలో అనేక ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వేతనాలు, ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో, తమ వేతనాల్లో నుంచి అధికంగా పన్నులకే వెళుతున్నది. దీంతో కొనుగోలుశక్తి గణనీయంగా తగ్గుతున్నదని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
ఐటీఆర్లో సవరణలకు రెండేండ్ల గడువు
పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. ఆదాయపన్ను చెల్లింపుల్లో తేడాలు ఉంటే ఆదాయపు పన్ను రిటర్న్లు (ఐటీఆర్) అప్డేట్ చేసుకునేందుకు రెండేండ్ల సమయం ఇస్తున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రకటించారు. ఐటీ రిటర్న్లో లోపాలను సవరించుకునేందుకు పన్ను చెల్లింపుదారులకు ఇది మంచి అవకాశమన్నారు. వన్-టైమ్ విండో ద్వారా ఈ సవరణలకు అవకాశం కల్పించనున్నట్టు వెల్లడించారు. పన్ను చెల్లింపులు మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఈ ఫైలింగ్ను అమల్లోకి తీసుకురాగా.. సాంకేతికత సమస్యలతో అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు. కాగా దివ్యాంగుల కోసం వారి తల్లిదండ్రులు, సంరక్షకులు జీవిత బీమా తీసుకొంటే ఆదాయ పన్నులో కొన్ని మినహాయింపులు ఉంటాయని కేంద్రం ప్రకటించింది.
పీడిస్తున్న కేంద్రం
కేంద్రంలోని బీజేపీ సర్కారు ఉద్యోగులను దారుణంగా మోసం చేస్తున్నది. వేతన జీవులను పూర్తిగా విస్మరిస్తున్నది. తెలంగాణలో రెండు పీఆర్సీలతో ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలు పెంచి ఆదుకుంటుంటే.. కేంద్ర ప్రభుత్వం పన్నులు పిండుకుంటూ పీడిస్తున్నది. ఆదాయ పరిమితిని పెంచాలని ఏడేండ్లుగా కోరుతున్నాం. అయినా మోదీ సర్కారు పెడచెవిన పెడుతున్నది. దీనిపై అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య కార్యవర్గంతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తాం. కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం.
30 శాతం పన్ను శోచనీయం
ఆదాయపు పన్ను పరిమితిని మార్చకపోవడం అత్యంత దారుణం. ఏడేండ్ల కిందటి ఆదాయ పరిమితినే ఇంకా కొనసాగించడం, సాధారణ ఉద్యోగులకు మాత్రం 10 లక్షల ఆదాయం దాటగానే 30 శాతం పన్ను వసూలు చేయడం శోచనీయం. కోట్లల్లో లాభాలు గడించే సంస్థలకు కార్పొరేట్ ట్యాక్స్ను 25 శాతానికి తగ్గించిన కేంద్రం, ఉద్యోగుల కష్టాన్ని పన్ను రూపంలో దండుకుంటున్నది.
-కే వేణుగోపాల్, టీపీటీఎఫ్, సీనియర్ నేత
కేంద్ర ఖజానాను నింపేవాళ్లమా?
కొత్తగా ఉద్యోగంలో చేరినవారుతప్ప మిగతా వారందరి జీతం ఏడాదికి 2.5 లక్షలపైనే ఉంది. గతంలో చాలామార్లు కేంద్రమంత్రులను కలిసిప్పుడు ఐటీ మినహాయింపునివ్వాలని కోరాం. కానీ మా గోడును బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఉద్యోగులంటేనే కేంద్ర ఖజానా నింపేవాళ్లమని ప్రభు త్వం భావిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. మధ్యతరగతి ఉద్యోగులంతా అసంతృప్తితో ఉన్నారు.
-మార్త రమేష్, తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు