Prajwal Revanna | బెంగళూరు, మే 2: దక్షిణాదిన 50 సీట్లు సాధించాలని బీజేపీ పెట్టుకున్న లక్ష్యానికి ప్రజ్వల్ రేవణ్ణ రూపంలో భారీ గండి పడింది. కర్ణాటకపై కమలం పార్టీ పెట్టుకున్న ఆశలన్నీ ఒకే దెబ్బకు ఆవిరయ్యాయి. జేడీఎస్తో పొత్తు పెట్టుకొని లాభపడాలని అనుకున్న ప్రయత్నాలు పూర్తిగా బెడిసికొట్టాయి. ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ వ్యవహారం బీజేపీకి భారీగా నష్టం చేసే అవకాశం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మే 7న ఎన్నికలు జరగనున్న కర్ణాటకలోని 14 లోక్సభ స్థానాల్లో బీజేపీ విజయావకాశాలను ఇది దెబ్బతీయవచ్చని, ముఖ్యంగా మహిళా ఓటర్లను బీజేపీకి దూరం చేయవచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే కర్ణాటకలో బీజేపీ ఈసారి చేదు ఫలితాలను చూడబోతున్నది. గత ఎన్నికల్లో 28 స్థానాల్లో 25 స్థానాలు దక్కించుకొని దాదాపుగా క్లీన్స్వీప్ చేసిన కమలం పార్టీకి ఈసారి సీట్ల సంఖ్యలో భారీగా కోత పడే అవకాశం ఉంది.
కర్ణాటకలోని మొత్తం 28 సీట్లలో దక్షిణ ప్రాంతంలోని 14 స్థానాలకు రెండో విడతలో పోలింగ్ ముగిసింది. దక్షిణ కర్ణాటకలో ఒక్కళిగ సామాజికవర్గం ప్రభావం ఎక్కువ. మొత్తం కర్ణాటకలో వీరి జనాభా దాదాపు 12 శాతం ఉంటుంది. ఈ సామాజికవర్గంలో దేవెగౌడ కుటుంబానికి మంచి పట్టుంది. ఈ ఎన్నికల్లో కూడా ఒక్కళిక సామాజికవర్గాన్ని ఆకట్టుకోవడం, దక్షిణ కర్ణాటకలో లాభపడాలనే ప్రయత్నంలో భాగంగానే జేడీఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకొని 3 సీట్లు కేటాయించింది. ఈ 3 సీట్లతో పాటు దక్షిణ కర్ణాటకలోని మొత్తం 14 సీట్లకు ఏప్రిల్ 26న పోలింగ్ పూర్తయ్యింది. ఇక్కడ జేడీఎస్తో పొత్తు వల్ల బీజేపీకి ఏమేరకు లాభం జరిగిందో కానీ ప్రజ్వల్ రేవణ్ణ ఉదంతం వల్ల ఎన్నికలు జరగాల్సిన మిగతా 14 నియోజకవర్గాల్లో మాత్రం దారుణంగా నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ప్రజ్వల్ వ్యవహారంపై బీజేపీకి ముందే సమాచారం ఉన్నప్పటికీ జేడీఎస్తో పొత్తు పెట్టుకుందని, ప్రజ్వల్కు టికెట్ ఇచ్చిందని జరుగుతున్న ప్రచారం బీజేపీకి ఇబ్బందికరంగా మారింది.
మే 7న మూడో విడతలో కర్ణాటకలోని చిక్కోడి, బెలగావి, బాగల్కోట్, బీజాపూర్, గుల్బర్గ, రాయచూర్, బీదర్, కొప్పల్, బల్లారి, హవేరి, ధార్వాద్, ఉత్తర కన్నడ, దవనగెరె, శిమొగ్గ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ 14 స్థానాలనూ గత ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకుంది. లింగాయత్ల ప్రభావం ఎక్కువగా ఉండే ఈ స్థానాలపై ఈసారి కూడా బీజేపీకి చాలా ఆశలు ఉండేవి. అయితే ప్రజ్వల్ వ్యవహారంతో ఈ ప్రాంతంలో బీజేపీకి పడే ఓట్లకు భారీగా గండి పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రజ్వల్ వ్యవహారం కేవలం లోక్సభ ఎన్నికల వరకే పరిమితం కాదని, ఆ తర్వాత కూడా కర్ణాటకలో బీజేపీ – జేడీఎస్ రాజకీయ ఆకాంక్షలకు గండి కొట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 136 సీట్లు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ కంటే ఆ పార్టీకి 23 సీట్లు ఎక్కువే ఉన్నాయి. అయినప్పటికీ అంతర్గత కలహాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బీజేపీ నేతలు పదేపదే చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా సీన్ మారింది. ప్రజ్వల్ వ్యవహారం బీజేపీ, మిత్రపక్షమైన జేడీఎస్లో పెను సంక్షోభానికి దారి తీస్తున్నది. ఇది కాంగ్రెస్కు కలిసి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు.