హుజూరాబాద్ : కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ పన్నులు వేయడం, రాయితీలు రద్దు చేయడమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం ఆయన హుజూరాబాద్లో మాట్లాడుతూ కేంద్రంలో లో బీసీ ల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదన్నారు. గౌడ కులస్తులకు మద్యం షాపుల్లో 15 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అన్నారు.
బీజేపీ నాయకులు ఏనాడైనా గౌడ కులస్తులకు 15 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని, చెట్టు పన్ను రద్దు చేయాలని ఆలోచన చేశారా అని నిలదీశారు. దేశంలోని గొల్ల కురుమలు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాల్లో గొర్రె పిల్లల పంపిణీ చేయాలని ఆలోచన చేశారా? అని ప్రశ్నించారు. కులవృత్తులను ధ్వంసం చేయడమే గత ప్రభుత్వాలు చేసిన పని అని ఆయన ఎద్దేవా చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు ఏం చేశామని చెప్పి ఓట్లు అడుగుతారని ఆయన నిలదీశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డు రద్దు చేసింది. ఆరోగ్య బీమా, ఇన్సూరెన్స్ రద్దు చేసింది అన్నారు. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రద్దు చేసి, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరిచింది బీజేపీ కాదా? అని హరీశ్రావు ప్రశ్నించారు. ఆయన వెంట పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులున్నారు.