సోమవారానికి మొత్తం 4,753 దరఖాస్తులు
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో దీపావళి పటాకుల దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తు గడువు మంగళవారంతో ముగియనున్నది. పటాకుల విక్రయ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను రాష్ట్ర అగ్నిమాపకశాఖ ఆన్లైన్లో జారీచేస్తున్నది. దుకాణాల్లో విక్రయించే సరుకు బరువు ఆధారంగా మూడు (100 కిలోల లోపు, 100 నుంచి 300 కిలోలు, 300 కంటే ఎక్కువ కిలోల) క్యాటగిరీల్లో అనుమతులు జారీచేస్తున్నారు. సోమవారం వరకు ఆన్లైన్లో మొత్తం 4,753 దరఖాస్తులు అందాయని, వీటిలో నిబంధనల ప్రకారం వివరాలన్నీ సక్రమంగా ఉన్న 4,173 మంది దుకాణదారులకు అనుమతులు జారీ అయ్యాయని రీజినల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య వెల్లడించారు. పటాకుల దుకాణాల ఏర్పాటుకు సరిపడినంత స్థలం లేని కారణంగా 164 దరఖాస్తులను తిరస్కరించామని, మరో 416 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. గతేడాది 3,393 దుకాణాల ఏర్పాటుకు అనుమతులు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు.