తిరుపతి,మే 29: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో ధనంజయుడు, సూపరింటెండెంట్ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.