తిరుపతి, జూలై : తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధవారం స్వామివారికి కవచ సమర్పణతో జ్యేష్ఠాభిషేకం శాస్త్రోక్తంగా ముగిసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ ఆలయంలో ఏకాంతంగా అభిషేకం నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కవచాలను ఆలయ విమాన ప్రాకారం చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత శతకలశ స్నపనం, మహాశాంతి హోమం చేపట్టారు.
అనంతరం మధ్యాహ్నం 12 నుంచి1 గంట వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవర్లను కల్యాణమండపంలోకి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. కవచ ప్రతిష్ట, అక్షతారోహణం నిర్వహించి బ్రహ్మఘోష వినిపించారు. ఆస్థానం నిర్వహించిన తరువాత స్వామి, అమ్మవార్లకు కవచ సమర్పణ చేశారు.