అమరావతి : ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉండే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హామీ ఇచ్చారు. ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. తల్లిదండ్రులను వదిలేసి దూర ప్రాంతాలకు వెళ్లి జీతభత్యాల కోసం పనిచేయడం కంటే ఇంటి వద్దే పనిచేస్తూ సరైన వేతనం పొందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
వైసీపీ నాయకులు( YCP Leaders ) గుండాలు, రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ మూలకెళ్లినా గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందని మండిపడ్డారు. ఏపీ గంజాయికి రాజధానిగా మారిందని పేర్కొన్నారు. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు ఇవ్వడమే కూటమి లక్ష్యమని అన్నారు. కష్ట, నష్టాల్లో ప్రజల గొంతుకనవుతానని తెలిపారు.
సినిమాలో పనిచేస్తే ఐదేళ్లలో రెండు వందల కోట్లు సంపాదించి రూ. 70 కోట్లు పన్ను కట్టానని తెలిపారు. ప్రజల భవిష్యత్తే తమకు ముఖ్యమని తెలిపారు. గిరిజనుల గళాన్ని అసెంబ్లీలో వినిపిస్తా్నని అన్నారు. కేసుల మాఫీ కోసమే ఇన్నాళ్లు వైఎస్ జగన్ (YS Jagan) మోదీ వెంట పడ్డారని, తాను మాత్రం సమస్యలను మోదీకి వివరించి పరిష్కరిస్తానన్న ధైర్యం తనకు ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కోసం రాజకీయాలకు రాలేదని స్పష్టం చేశారు.