అమృత్సర్: పంజాబ్లోని రాజకీయ పార్టీలన్నింటినీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఊడ్చి పారేసింది. మొత్తం 117 స్థానాలకు గాను 92 సీట్లను కొల్లగొట్టింది. ఆప్ ధాటికి మిగతా పార్టీలు పత్తా లేకుండా పోయాయి. అధికార కాంగ్రెస్ కేవలం 18 సీట్లకే పరిమితమై రెండో స్థానంలో నిలిచింది. శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ+) నాలుగు, బీజేపీ రెండు స్థానాల్లో గెలిచాయి. ఆప్ కార్యకర్తలను, పంజాబ్ ఓటర్లను ఉద్దేశించి ఆప్ అధినేత కేజ్రీవాల్ ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రసంగించారు. ‘కేజ్రీవాల్ ఉగ్రవాది కాదు అని పంజాబ్ ప్రజలు తమ ఓట్ల ద్వారా తీర్పునిచ్చారు’ అని వ్యాఖ్యానించారు. పంజాబ్లో ఆప్ విప్లవం సృష్టించిందన్నారు. రాబోయే రోజుల్లో ఈ విప్లవం దేశమంతటికీ విస్తరిస్తుందని ఆశాభావం ప్రకటించారు. పంజాబ్ సీఎం అభ్యర్థిగా భగవంత్మాన్ను ఆప్ ఇప్పటికే ప్రకటించింది. సీఎం చన్నీ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. ఐదు సార్లు సీఎం, ఎస్ఏడీ అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్ తనకు ఎంతో పట్టు ఉన్న లంబీ స్థానంలో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ అమృత్సర్(తూర్పు) నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మాజీ సీఎం అమరిందర్ కూడా పటియాలా నుంచి విజయం సాధించలేకపోయారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ మరోసారి విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో 273 చోట్ల బీజేపీ కూటమి గెలుపొందింది. అయితే 2017 ఎన్నికలతో పోలిస్తే 49 స్థానాలను కోల్పోయింది. ఈ ఎన్నికల్లో బీజేపీ స్వతహాగా 255 చోట్ల విజయం సాధించింది. బీజేపీ కూటమి పక్షాలైన అప్నాదళ్ (సోనెలాల్) 11, నిషాద్ పార్టీ ఏడు చొప్పున సీట్లను కైవసం చేసుకున్నాయి. అఖిలేశ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) కూటమి ఈ ఎన్నికల్లో 125 సీట్లతో గణనీయంగా పుంజుకున్నా అధికారానికి చేరువకాలేకపోయింది. మాజీ సీఎం మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. బీఎస్పీకి ఒకటి, కాంగ్రెస్కు రెండు సీట్లు దక్కాయి. సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ ఐదు సీట్లలో గెలిచింది.
పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్దపార్టీగా అవతరించింది. రాష్ట్రంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకుగానూ 20 స్థానాల్లో విజయం సాధించి మెజారిటీ మార్క్కు ఒక్క సీటు దూరంలో నిలిచిపోయింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీకి ఏడు సీట్లు అధికంగా వచ్చాయి. ఇక కాంగ్రెస్ కూటమి12 స్థానాలకే పరిమితమైంది. రాష్ట్రంలో ఆప్ ఈసారి బోణీకొట్టింది. రెండు సీట్లు కైవసం చేసుకున్నది. ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నది. తమకు ఎంజీపీతోపాటు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ప్రకటించారని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సదానంద్ వెల్లడించారు. అయితే సీఎంగా ప్రమోద్సావంత్నే కొనసాగిస్తారా లేక కొత్తవారిని తెరపైకి తెస్తారా అన్నదానిపై ఇంకా స్పష్టతలేదు.
ఉత్తరాఖండ్లో వరుసగా రెండోసారి అధికారంలోకి బీజేపీ
డెహ్రాడూన్: దేవభూమి ఉత్తరాఖండ్లో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. మొత్తం 70 అసెంబ్లీ సీట్లకుగాను ఆ పార్టీ 47 సీట్లను గెలిచింది. దీంతో రాష్ట్ర చరిత్రలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన పార్టీగా బీజేపీ రికార్డుకెక్కింది. అయితే ఎన్నికల్లో ముందుండి పార్టీని నడిపించిన సీఎం పుష్కర్ సింగ్ ధామి ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ కేవలం 19 సీట్లకే పరిమితమైంది. బీఎస్పీ రెండు చోట్ల గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థులు రెండు స్థానాల్లో విజయం సాధించారు. కాగా, ఓటమి పాలైన సీఎం పుష్కర్ సింగ్ ధామిని మళ్లీ సీఎం చేస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
కాషాయ పార్టీకి 32 సీట్లు
ఇంఫాల్: మణిపూర్లో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. మొత్తం 60 సీట్లలో 32 స్థానాలను కమలం పార్టీ కైవసం చేసుకుంది. కన్రాడ్ సంగ్మాకు చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) 7 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్, నాగా పీపుల్స్ ఫ్రంట్ ఐదు సీట్ల చొప్పున తమ ఖాతాలో వేసుకున్నాయి. ఇతర పార్టీలు 11 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ విజయం అందించిన ఓటర్లకు సీఎం బీరెన్ సింగ్ ధన్యవాదాలు తెలిపారు. అయితే తదుపరి సీఎంగా ఎవరుంటారనే దానిపై ఆయన సమాధానం చెప్పలేదు. 2017 ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ నిలిచినా జిమ్మిక్కులతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.