మలక్పేట, మార్చి 28: బ్రేయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను జీవన్దాన్ సంస్థ అవయవదానం కింద శనివారం గ్రీన్ చానల్ద్వారా మలక్పేటలోని యశోద ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. జీవన్దాన్ సంస్థ అభ్యర్థనతో జూబ్లీహిల్స్ వెళ్లే దారిలోని ట్రాఫిక్ పోలీసులంతా రోడ్లపై ట్రాఫిక్ క్లియర్ చేసి అంబులెన్స్కు దారి ఇవ్వటంతో మలక్పేట నుంచి జూబ్లీహిల్స్కు అంబులెన్స్ 22 నిమిషాల్లో చేరుకుంది. వివరాల్లోకి వెళ్తే..
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల గ్రామానికి చెందిన పి.హరీష్(25) ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఉప్పల్ సమీపంలో విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టి ప్రమాదానికి గురికాగా, చికిత్స నిమిత్తం అతన్ని మలక్పేటలోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు బ్రేయిన్ డెడ్ అయినట్లు నిర్దారించి జీవన్దాన్ సంస్థకు సమాచారం అందించారు. సంస్థ ప్రతినిధులు వెంటనే మృతుని తల్లిదండ్రులను సంప్రదించి అవయవదానంపై అవగాహన కల్పించగా, హరీష్ అవయవాలను దానం చేసేందుకు వారు అంగీకరించారు.
దాంతో గుండె, కాలేయం, ఊపరితిత్తులను దానం చేయగా, వారు ట్రాఫిక్ ఉన్నతాధికారులను సంప్రదించి గ్రీన్ చానల్ అవకాశం కల్పించాలని కోరారు. వారు కూడా సహకరించటంతో ఉదయం 9.23 గంటలకు అవయవాలతో మలక్పేట యశోద ఆసుపత్రి నుంచి అంబులెన్స్ బయలుదేరగా, ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై ట్రాఫిక్ క్లియర్చేసి అంబులెన్స్కు దారి కల్పించారు. దాంతో కేవలం 22 నిమిషాల్లో అంబులెన్స్ జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రికి చేరుకుంది. తరలించిన అవయవాలతో ఐదుగురు రోగుల ప్రాణాలు కాపాడారని వైద్యులు తెలిపారు.