సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ): నగరంలోని అమీర్పేట్ సర్వే నంబర్ 22లో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక బ్లిస్ ప్రాజెక్టుపై తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా) కొరఢా ఝళిపించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రెరా రిజిస్ట్రేషన్ గడువు ముగిసిందని, ఇకపై ఇది ఎంతమాత్రం చెల్లుబాటు కాదని స్పష్టం చేస్తూ రెరా మంగళవారం ఒక బహిరంగ ప్రకటన (పబ్లిక్ అడ్వైజరీ) విడుదల చేసింది. గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, ఆర్థిక సంస్థల ప్రయోజనాలను రక్షించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేరొంది.
బ్లిస్ ప్రాజెక్ట్లోని అపార్ట్మెంట్లు, యూనిట్లు, ప్లాట్లు లేదా భవనాలకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు చేయకూడదని చెప్పారు. మారెటింగ్ చేయడం, బుకింగ్లు తీసుకోవడం, విక్రయించడం లేదా కొనుగోలు చేయవలసిందిగా ఎవరినీ ఆహ్వానించడం వంటి పనులు పూర్తిగా నిషేధించబడినట్లు పేర్కొన్నారు.
ఈప్రాజెక్ట్ను చట్టబద్ధమైన రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్గా చూపించి ఎలాంటి వాణిజ్య, ఆర్థిక లేదా ప్రచార ప్రయోజనాలు పొందడానికి ప్రమోటర్కు అర్హత లేదన్నారు. ఈ ప్రాజెక్టులో లావాదేవీలు జరిపే విషయంలో ప్రజలు, గృహ కొనుగోలుదారులు, ఆర్థిక సంస్థలు, బ్యాంకులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని రెరా సూచించింది. సదరు ప్రాజెక్ట్ ప్రస్తుత చట్టపరమైన స్థితిగతులను పూర్తిగా సరిచూసుకున్న తర్వాతే ముందడుగు వేయాలని, గడువు ముగిసిన రిజిస్ట్రేషన్ను నమ్మి మోసపోవద్దని రెరా చైర్మన్, అధికారులు ప్రకటనలో హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు అనుమతికి సంబంధించి జీహెచ్ఎంసీ సైతం షోకాజ్ నోటీసు జారీచేసింది.
వివాదంలో ప్రాజెక్ట్ రియల్ ఎస్టేట్ చట్టం 2016 ప్రకారం ఈ ప్రాజెక్టుకు 21 మార్చి 2020న (P02500001906నంబర్) తో రెరా రిజిస్ట్రేషన్ లభించింది. అయితే సదరు ప్రాజెక్ట్ భూమి ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్), నిర్మిత బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందని రెరాకు అధికారిక సమాచారం అందింది. దీనిని నిశితంగా పరిశీలించిన అధికారులు, ఈ ప్రాజెక్ట్ రెరా రిజిస్ట్రేషన్ కాలపరిమితి 2 జనవరి 2026తోనే ముగిసిపోయిందని, ఇకపై దీనికి ఎలాంటి చట్టబద్ధత లేదని తేల్చిచెప్పారు. రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన నేపథ్యంలో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ సంస్థపై పలు ఆంక్షలు విధించినట్లు తెలిపారు.