దౌల్తాబాద్, జూన్ 20: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని హైమద్నగర్ గ్రామంలో సెయింట్ ఆన్స్ పాఠశాలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు, నోట్బుక్కులను ఎలాంటి అనుమతులు లేకుండా అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, నోట్బుక్కులను ప్రైవేట్ వ్యక్తుల ద్వారా విక్రయిస్తూ తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపుతున్నారని వారు పేర్కొన్నారు.
తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. నర్సరీ విద్యార్థులకు రూ.625, ఎల్కేజీకి రూ.2,585, యూకేజీకి రూ.2,910, మొదటి తరగతికి రూ.3,516, రెండో తరగతికి రూ.3,561, మూడో తరగతికి రూ.4,242, నాలుగో తరగతికి రూ.4,391, ఐదో తరగతికి రూ.4,381 వసూలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు నోట్బుక్కుల పేరుతో రూ.780 నుంచి రూ.1,280 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు.
గత మూడు సంవత్సరాలుగా ఈ వ్యవహారం కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠశాల యాజమాన్యం సూచించిన చోటే పుస్తకాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై మండల విద్యాశాఖ అధికారి గజ్జల కనకరాజును వివరణ కోరగా పాఠ్యపుస్తకాలు, నోట్బుక్కుల విక్రయాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని తెలిపారు. నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ ఘటన ప్రస్తుతం మండలంలో చర్చనీయాంశంగా మారగా, అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.