నలుగురు కూలీల కాల్చివేత
శ్రీనగర్, అక్టోబర్ 17: జమ్ముకశ్మీర్లో స్థానికేతరులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. కశ్మీర్లో 24 గంటల వ్యవధిలోనే నాన్-లోకల్ వ్యక్తులపై మూడు ఉగ్రదాడులు జరిగాయి. దక్షిణ కశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో బీహార్కు చెందిన కార్మికులు అద్దెకు ఉంటున్నారు. వలస కూలీలు ఉంటున్న ఇంట్లోకి చొరబడిన ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఆదివారం జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. మరో వ్యక్తి గాయపడ్డాడు. ఉగ్రవాదుల కోసం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు శనివారం సాయంత్రం ఇద్దరు స్థానికేతరులను ఉగ్రవాదులు కాల్చి చంపేశారు. వీరిలో ఒకరు బీహార్కు చెందిన వ్యాపారి, మరొకరు యూపీకి చెందిన వడ్రంగి. ఈ దాడులు కశ్మీర్లో స్థానికేతరుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వలస కూలీలందరినీ సమీపంలోని పోలీసు/మిలిటరీ భద్రతా క్యాంపుల్లోకి తరలించాలని కశ్మీర్ ఐజీ పోలీసులను ఆదేశించారు. ‘ఇది చాలా అర్జెంట్’ అని 10 జిల్లాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఉగ్రదాడులను అన్ని రాజకీయ పక్షాలు ఖండించాయి.