చిత్తూరు జిల్లా : కుప్పంలో అన్న క్యాంటీన్ ధ్వంసం మరోసారి కలకలం సృష్టించింది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో కుప్పంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. సమాచారం అందుకున్న టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత వారం చంద్రబాబు పర్యటనలో అన్న క్యాంటీన్లు ధ్వంసం కాగా, ఇప్పుడు మరో క్యాంటీన్ ధ్వంసం కలకలం రేపుతున్నది.
అన్న క్యాంటీన్లపై దాడి చేసి ధ్వంసం చేయడం జగన్ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. అర్థరాత్రి సమయంలో దాడులకు తెగబడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. గత 86 రోజులుగా కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ సమీపంలో అన్న క్యాంటీన్ నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరవడాన్ని జగన్ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతున్నదని అభిప్రాయపడ్డారు. వైసీపీ హయాంలో 201 క్యాంటీన్లను రద్దు చేశారని, అన్న క్యాంటీన్పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్న క్యాంటీన్లను కొనసాగిస్తామన్నారు.
మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. రేణిగుంట నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి చిత్తూరు సబ్ జైలుకు వెళ్లి మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాస్తోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలను ములాఖాత్లో కలుసుకుంటారు. సాయంత్రం 5.30 గంటలకు చంద్రగిరి చేరుకుని ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన టీడీపీ నాయకులు భాస్కర్, భాను ప్రకాష్ రెడ్డిలకు నివాళులర్పిస్తారు. పెరుమలపల్లెలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీడీపీ నేత సోమనాథరెడ్డిని పరామర్శిస్తారు.