జనగామ : జనగామలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎర్రటి ఎండలో నిరసన తెలుపుతున్న ఆర్టీసీ కార్మికులు డిపో లోపల నిరసన తెలిపే విధంగా అనుమతి ఇవ్వాలంటూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పోలీసులను కోరారు. ఇందుకు పోలీసులు అనుమతించకపోవడంతో ఆర్టీసీ కార్మికులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కార్మికులు బారికేడ్లను తోసుకొని లోపలికి వచ్చి డీఎం కార్యాలయం ముందు ఆర్టీసీ కార్మికులు, బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాడుతూ..ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. హక్కుల కోసం పోరాడి ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకుండు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు విలీనం కోసం బిల్లు పెట్టమని అడగడం లేదు. అపాయింట్మెంట్ డే ప్రకటించమని కోరుతున్నారు.
మహాలక్ష్మి పధకంతో ఆర్టీసీకి బకాయి ఉన్న 3 వేల కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేట్కి కాకుండా ఆర్టీసీకే అప్పగించాలని సూచించారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆర్టీసీ కార్మికులను చర్చకు పిలిచి వాల్ల ప్రధానమైన 5 డిమాండ్లను నెరవేర్చాలని పేర్కొన్నారు. తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడపాలని ప్రయత్నిస్తే ఆర్టీసీ కార్మికులతో కలిసి బస్సులను అడ్డుకుంటామని హెచ్చరించారు.
