రుద్రూర్: మానవత్వాన్ని కాపాడి మనిషిలో మంచిని పెంచేందుకే ఆలయ నిర్మాణాలు చేపడుతారని సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం రుద్రూర్ మండలం అంబం గ్రామ పంచాయతీ పరిధిలో గల లక్ష్మిపూర్ క్యాంపులో రూ. 25లక్షలతో నిర్మిస్తున్న రామాలయ నిర్మాణానికి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. చేసే పనికి దైవ సంకల్పం తోడయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తు దైవ చింతన పెరుగుదలకు సీఎం కృషి చేస్తున్నారని కొనియాడారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ..పోచారం శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి చూస్తుంటే ముచ్చటేస్తుందని , ఆలయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పని పూర్తి చేసేదాక నిద్రపోరని అన్నారు. రాష్ట్రంలో ఏ నియోజక వర్గంలో లేనన్నీ డబుల్బెడ్ రూం ఇండ్లను బాన్స్వాడ నియోజక వర్గంలో నిర్మాణం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాంనారాయణరెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్రెడ్డి, ఆర్డీఓ రాజేశ్వర్, ఎంపీపీ అక్కపల్లి సుజాతనాగేందర్, వైస్ ఎంపీపీ సాయిలు, జడ్పీటీసీ నారోజి గంగారాం, సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.