హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు విస్తృతమైన చర్యలను తీసుకుంటున్నదని, టెలిఫోన్ బూత్ల తరహాలో ఈవీల చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను రూపొందించిందని తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో) ఎండీ జానయ్య వెల్లడించారు.
ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు అనేక రాయితీలను ప్రకటించిందని తెలిపారు. ప్రస్తుతం ఈవీ టూవీలర్లు రూ.50 వేల నుంచి రూ.2 లక్షలు, త్రీవీలర్లు రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షలు, ఫోర్ వీలర్లు రూ.8 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు వివిధ ధరల్లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఈవీల వాడకాన్ని ప్రోత్సహించేందుకు కిలోవాట్పై రూ.15 వేల సబ్సిడీని అందజేస్తున్నదని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీఎస్ రెడ్కో ఎండీ జానయ్య సూచించారు.
విస్తృత సంఖ్యలో చార్జింగ్ పాయింట్లు
హైదరాబాద్లోని పబ్లిక్ స్థలాల్లో 118, కరీంనగర్లో 10, వరంగల్లో 10 చార్జింగ్ పాయింట్లను నెలకొల్పేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామని, ఆసక్తి ఉన్న ప్రైవేట్ వ్యక్తులు చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకోవచ్చని, అందుకు రూ.5 నుంచి 8 వేల ఖర్చు అవుతుందని జానయ్య వివరించారు. చార్జింగ్ పాయింట్లకు భూములను లీజుకు ఇవ్వడం ద్వారా కూడా ఆదాయం పొందవచ్చని, ఆసక్తి ఉన్నవారు రెడ్కోను సంప్రదించాలని సూచించారు.
పాత వాహనాలకు ఎలక్ట్రిక్ బ్యాటరీలను అమర్చుకోవచ్చని వివరించారు. ఈవీలను ప్రోత్సహించడంలో భాగంగా శనివారం నుంచి రెండు రోజులపాటు ‘గో ఎలక్ట్రిక్ రోడ్ షో’ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ఈవీ ఎగ్జిబిషన్ను మంత్రి జగదీశ్రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు.