హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అమలు చేస్తున్న జ్వర సర్వేపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రశంసలు కురిపించారు. ఇంటింటికీ సర్వే చేసి, అనుమానిత లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, ప్రాథమిక స్థాయిలోనే చికిత్స అందించడాన్ని ‘ఉత్తమ వ్యూహం’గా వర్ణించారు. ఇదే విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో అనుసరించేందుకు విధానం రూపొందిస్తామని వెల్లడించారు. కరోనా పరిస్థితులపై శుక్రవారం రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్యశాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో కేంద్రమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, లక్షద్వీప్, అండమాన్ నికోబార్, పుదుచ్చేరి మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ తరఫున వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఖమ్మం కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ప్రభుత్వ సన్నద్ధత, జ్వర సర్వే, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై వివరించారు. జ్వర సర్వేతో ప్రభుత్వం వైద్యాన్ని ఇంటి వద్దకే చేర్చిందని, దీనివల్ల పాజిటివిటీ రేటు తగ్గి, హాస్పిటలైజేషన్ తగ్గిందని చెప్పారు. రెండో వేవ్ సమయంలో కరోనా కట్టడి కోసం దేశంలోనే తొలిసారి తెలంగాణ జ్వర సర్వే మొదలుపెట్టి, మంచి ఫలితాలు సాధించిందని గుర్తుచేశారు. థర్డ్వేవ్ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మరోసారి జ్వర సర్వే ప్రారంభించినట్టు చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ముందస్తుగా రాష్ట్రంలో కోటి హోం ఐసొలేషన్ కిట్లు, రెండు కోట్ల టెస్టింగ్ కిట్లు సమకూర్చుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 77,33,427 ఇండ్లల్లో జ్వర సర్వే చేసి 3,45,951 కిట్లను అందించామని తెలిపారు. కిట్లు వినియోగించినవారు మూడు, నాలుగు రోజుల్లో కోలుకుంటున్నట్టు వివరించారు. కొవిడ్ ఓపీ సేవలను సబ్ సెంటర్, పీహెచ్సీ, బస్తీ దవాఖానల నుంచి టీచింగ్ దవాఖానల వరకు ఏర్పాటుచేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో 27 వేలకు పైగా పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించినట్టు పేర్కొన్నారు.
ప్రస్తుతం 60 ఏండ్లకు పైబడి కో-మార్బిడిటీస్ ఉన్నవారికే బూస్టర్ డోస్ ఇస్తున్నారని, వృద్ధులందరికీ మూడో డోసు ఇవ్వాలని మంత్రి హరీశ్రావు ఈ సందర్భంగా మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కొవిషీల్డ్ రెండు డోసుల గడువును తగ్గించాలని, రెండో డోసుకు ప్రికాషనరీ డోసుకు మధ్య వ్యవధి 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలని కోరారు. దీంతోపాటు 18 ఏండ్లు దాటిన ప్రతి పౌరుడికీ బూస్టర్ ఇచ్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
ఈసీఅర్పీ-2 కింద రాష్ట్రానికి రావాల్సిన రెండో దశ పెండింగ్ నిధులు విడుదల చేయాలని కూడా హరీశ్రావు కోరారు. పీడియాట్రిక్ ఐసీయూలకు ఎస్ఎన్సీయూ తరహాలో మానవ వనరులను సమకూర్చాలని సూచించారు. కేంద్రం సరఫరా చేసిన వెంటిలేటర్స్ను వినియోగంలోకి తెచ్చేందుకు అవసరమైన హ్యుమిడిఫయర్లను కూడా సరఫరా చేయాలని కోరారు.
ఖమ్మం, జనవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జ్వర సర్వే అద్భుతంగా జరిగిందని, సర్వే పూర్తయిన జిల్లాల్లో రెండో విడత ప్రారంభిస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు. రెండు, మూడు జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ జ్వర సర్వే పూర్తయిందని తెలిపారు. శుక్రవారం రాష్ట్రంలో తొలిసారిగా ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటుచేసిన క్యాథ్ల్యాబ్, ట్రామాకేర్ సెంటర్ను ప్రారంభించారు. ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో గత నెలలో కరోనా సోకిన 20 మంది గర్భిణులకు ప్రసవాలు చేయడం అభినందనీయమన్నారు. కరోనా వ్యాక్సిన్ రెండో డోసు వేయడంలో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచేందుకు కలెక్టర్, వైద్యాధికారులు చేసిన కృషిని ప్రశంసించారు. కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్రెడ్డి, రాములునాయక్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్రెడ్డి, కలెక్టర్ వీపీ గౌతమ్, వైద్యసదుపాయాల సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
l 21,150 సర్వేలో పాల్గొనే బృందాలు
l 2,00,00,000 అందుబాటులో టెస్టింగ్ కిట్లు
l 1,00,00,000 హోం ఐసొలేషన్ కిట్లు
l 77,33,427 జ్వర సర్వే చేసిన ఇండ్లు
l 3,45,951 ఇచ్చిన హోంఐసొలేషన్ కిట్లు