హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. గతంలో ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై.. ఆయన లేఖలో వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ చేసిన నిరాధారమైన వాదనలు పట్టించుకోవద్దని ఈఎన్సీ సూచించారు. తెలంగాణలో గోదావరి నీటిని కృష్ణాబేసిన్కు తరలించే చోట టెలీమెట్రీలు ఏర్పాటు చేయడంతో పాటు గోదావరి నుంచి తరలించే జలాలను రెండు రాష్ట్రాలకు పంచాలని కేఆర్ఎంబీని కోరింది. ఈ మేరకు ఆయన స్పందించారు. కృష్ణా నీరు ఇవ్వని ప్రాంతానికే గోదావరి నీటిని మళ్లిస్తున్నట్లు తెలిపారు. గోదావరి జలాల మళ్లింపుతో కృష్ణాలో నీరు మిగులుతోందని, ట్రైబ్యునళ్ల ప్రకారం అదనపు వాటా కిందికి రాదని స్పష్టం చేశారు. మిగులు నీటిని ఎగువ ప్రాజెక్టుల్లో వినియోగించుకోవచ్చని తెలిపారు. తక్కువ నీటి మళ్లింపునకు టెలీమెట్రీలు అవసరం లేదని లేఖలో ఈఎన్సీ స్పష్టం చేశారు.