హైదరాబాద్ : తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు మంటలు పుట్టిస్తున్నాయి. ఎండల తీవ్రత ఆది, సోమవారాల్లో మరింత పెరుగుతుందని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇన్చార్జి డైరెక్టర్ నాగరత్న తెలిపారు. మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట తదితర జిల్లాల్లో ఆదివారం వడగాడ్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో శనివారం అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం 43.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయినట్లు టీఎస్డీపీఎస్ వెల్లడించింది. మంచిర్యాలలో 43.5 డిగ్రీలు, నల్లగొండలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.