అల్వాల్, ఏప్రిల్ 3: ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి స్థానికుల ఇబ్బందులను పరిష్కరిస్తానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం అల్వాల్ సర్కిల్ పరిధిలోని సిటిజన్ కాలనీలో సుమారు రూ. 38 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్, అల్వాల్ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్యలతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తన రెండేండ్ల వ్యవధిలో అల్వాల్ సర్కిల్తోపాటు మల్కాజిగిరి నియోజకవర్గాన్ని సుమారు రూ. 550 కోట్లతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని చెప్పారు. రానున్న మూడేండ్లలో మల్కాజిగిరి నియోజకవర్గం పరిధి శివారు ప్రాంతాల్లోని అన్ని సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఎంఈఎస్ కాలనీలో పెండింగ్లో ఉన్న వివిధ పనులను పూర్తి చేసేందుకు అవసరమైన కోటి రూపాయల ప్రత్యేక నిధులను అందజేయనున్నట్లు ఎమ్మెల్యే మైనంపల్లి కాలనీవాసులకు తెలిపారు. సదరు నిధులతో ఎంఈఎస్ కాలనీలో అంతర్గత రహదారులను, భూగర్భ డ్రైనేజీ, తాగునీటి వసతులను కల్పించేందుకు కృషిచేస్తానని అన్నారు. సదరు సమస్యలకు తోడుగా మరేవైనా సమస్యలు ఉంటే వాటిని తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు తెలిపారు.