కందుకూరు, ఏప్రిల్ 3 : రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని పులిమామిడిలో నిర్మించిన రైతు వేదికను రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ అని అన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రైతులు ఒక చోట సమావేశమై పంటల సాగు విషయంలో చర్చించుకునేందుకు మంచి అవకాశమని తెలిపారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతుల కోసం నిరంతరం పని చేస్తుంటే ప్రతి పక్షాలు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు కల్పించడంతో పాటు రైతు బీమా, ఎకరానికి రైతు బంధు కింద ఏడాదిక రూ.10 వేలు, రుణమాఫీ, పంట రుణాలను అందిస్తున్నట్లు చెప్పారు. రూ. 5 లక్షల బీమా డబ్బులను ఇస్తుందని తెలిపారు. అనంతరం చిప్పలపల్లి, మురళీనగర్ గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.