హైదరాబాద్ (ఉస్మానియా యూనివర్సిటీ), జనవరి 21: అభివృద్ధి బాటలో విజయ డెయిరీ అడుగులు వేస్తున్నది. పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రైతుల సంక్షేమం దిశగా దూసుకుపోతున్నది. ఈ క్రమంలోనే నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చిన డెయిరీ.. అటు ఉద్యోగులు, ఇటు రైతులకు మరిన్ని ప్రయోజనాలు కలిగేలా ప్రణాళికలు రచిస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ మిల్క్ డెయిరీల లాభాల కోసం అప్పటి పాలకులు విజయ డెయిరీని నిర్వీర్యం చేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పడిలేచిన కెరటంలా డెయిరీ నేడు మళ్లీ సగర్వంగా నిల్చోవడం విశేషం.
రెట్టింపైన టర్నోవర్
రాష్ట్ర ప్రభుత్వం, డెయిరీ యాజమాన్యం తీసుకున్న చర్యలతో పాల సేకరణ, అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. అప్పట్లో రోజుకు కేవలం లక్షన్నర నుంచి 2 లక్షల లీటర్ల పాలను సేకరించేవారు. ప్రస్తుతం రోజుకు 5 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. అమ్మకాలు సైతం లక్షన్నర లీటర్ల నుంచి 3.72 లక్షల లీటర్లకు చేరుకున్నాయి. దీంతో డెయిరీ టర్నోవర్ రూ.350 కోట్ల నుంచి రూ.710 కోట్లకు ఎగిసింది. ఈ క్రమంలోనే ఏటా రూ.30 కోట్ల నష్టాల నుంచి గట్టెక్కింది. సంస్థ అప్పులను చెల్లించడంతోపాటు రూ.60 కోట్లను ఫిక్సిడ్ డిపాజిట్ల కింద జమ చేయడం గమనార్హం. డెయిరీ అభివృద్ధికి ఉన్న అన్ని మార్గాలను పాలకవర్గం అన్వేషిస్తోంది.
రైతులకు ప్రోత్సాహకాలు
పాడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఈ క్రమంలోనే 2018 నుంచి విజయ డెయిరీకి పాలు పోస్తున్న పాడి రైతులకు లీటరు పాలపై రూ.4 చొప్పున ప్రోత్సాహకంగా అందిస్తున్నారు. రూ.3 ప్రభుత్వం అందజేస్తుండగా, రూపాయి విజయ డెయిరీ ఇస్తున్నది. అంతేగాక చదువులు, పెండ్లిళ్లు, చావులకు సైతం రైతులకు అండగా డెయిరీ ఉంటున్నది. రూ.5వేల నుంచి 10 వేలదాకా సాయం చేస్తున్నది. మరోవైపు నిరుద్యోగులకూ ఆసరాగా నిలుస్తున్నది. బ్యాంక్ రుణాలపై పశువులను కొని, వాటి పాలను డెయిరీకి పోస్తున్నవారికి చేయూతనిస్తున్నది. ఇదిలావుంటే విజయ డెయిరీ ఉత్పత్తులను కేవలం తెలంగాణకే పరిమితం చేయకుండా దేశవ్యాప్తం చేస్తున్నారు. ముంబైలోనే నెలకు 50 టన్నుల నెయ్యి, ఢిల్లీలో నెలకు 150 టన్నుల బటర్ను విక్రయిస్తున్నారు. 2020 డిసెంబర్లో విజయవాడలో పార్లర్ను ప్రారంభించారు. రాబోయే రోజుల్లో పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ర్టాల్లోనూ తమ ఉత్పత్తులను విక్రయించే దిశగా సంస్థ ముందుకెళ్తున్నది. సంస్థకు చెందిన పలు వివరాలు..
విజయ డెయిరీని దేశంలోనే అగ్రగామి డెయిరీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాట పట్టించాం. రాష్ట్ర పాడి పరిశ్రమ, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా డెయిరీకి అండగా నిలిచారు. పాడి రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కావాల్సిన చర్యలు తీసుకున్నాం. రాబోయే రోజుల్లో వెయ్యికిపైగా మిల్క్ పార్లర్లను నెలకొల్పేందుకు ప్రణాళికలు రచించాం. తద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు సైతం లభిస్తాయి. మెగా డెయిరీ ప్లాంటును నిర్మిస్తున్నాం. దీనిద్వారా ఇప్పటికే ఉన్న 2.13 లక్షల రైతులకుతోడు మరో 5 లక్షల రైతులకు మేలు చేకూరనుంది’
–లోక భూమారెడ్డి, టీఎస్డీడీసీఎస్ఎఫ్ చైర్మన్