హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ నికర జలాల నుంచి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కోసం 45 టీఎంసీల నీటిని వినియోగించుకొనేందుకు అనుమతివ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్కు రాష్ట్ర సాగు నీటిపారుదలశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ గురువారం లేఖ రాశారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు ద్వారా ఏపీ ప్రభుత్వం గోదావరి నీటిని కృష్ణా బేసిన్కు మళ్లిస్తే నాగార్జునసాగర్ ఆయకట్టుకు అందజేస్తున్న 80 టీఎంసీలను నిలిపివేయాల్సి ఉంటుందని, ఆ నీటిని బేసిన్లోని ఇతర రాష్ర్టాలు పంచుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఉమ్మడి ఏపీలోనే ఈ మేరకు ఒప్పందం కుదిరిందని గుర్తుచేశారు. 1985 లో పోలవరం నిర్మాణ ప్రతిపాదనల్లోనే.. పోలవరం నుంచి 80 టీఎంసీల నీటిని కృష్ణాబేసిన్కు తరలించాలని కూడా ప్రతిపాదించారు. అందువల్ల సాగర్ నుంచి దిగువన ఉన్న ఆయకట్టుకు విడుదల చేస్తున్న కృష్ణా జలాలను అంతేమొత్తంలో నిలిపేయాలి. ఈ నీటిలో ఎగువన ఉన్న తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు వాటా ఉంటుంది. ఆ నీటిలో సాగర్ ఎగువన 45 టీఎంసీలను వినియోగించుకునే హక్కు ఉమ్మడి ఏపీకి దక్కింది. నికర జలాలను ఎస్ఎల్బీసీకి కేటాయిస్తూ డీపీఆర్ను సైతం ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సీడబ్ల్యూసీకి పంపింది. పోలవరం అనుమతులు వచ్చాక నివేదించాలని ఎస్ఎల్బీసీ డీపీఆర్ను సీడబ్ల్యూసీ 1986లో తిప్పిపంపింది. తర్వాత ఉమ్మడి ఏపీలో ప్రభుత్వాలు ఎస్ఎల్బీసీని సీరియస్గా తీసుకోలేదని మురళీధర్ పేర్కొన్నారు.
నాటి ఉమ్మడి ప్రభుత్వం ఏపీ ప్రయోజనాలకే పెద్దపీట వేసిందని మురళీధర్ ఆరోపించారు. శ్రీశైలం కుడిగట్టు కాలువకు 1981లోనే నికర జలాలను కేటాయించుకొన్నదని, 1988 నాటికే ప్రాజెక్టును పూర్తి చేసిందని గుర్తుచేశారు. ఎస్ఎల్బీసీ కింద మొదట 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు 30 టీఎంసీలను కేటాయించిందని, ఆ తరువాత ఆయకట్టును 2007లో 4 లక్షల ఎకరాలకు పెంచినా ఆ మేరకు జలాలను మాత్రం కేటాయించలేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తన నీటి వాటాలోంచి ఎస్ఎల్బీసీకి మరో 10 టీఎంసీలను కేటాయించటంతో మొత్తం 40 టీఎంసీలకు చేరిందని వివరించారు. రాష్ట్రస్థాయి సాంకేతిక సలహా మండలి 2013లో చేసిన సిఫారసుల మేరకే హైదరాబాద్, నల్లగొండ ప్రాంత తాగునీటి అవసరాలకు 16.5 టీఎంసీలను ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కేటాయిస్తూ జీవో 464ను జారీచేసిందన్నారు. బచావత్ అవార్డు ఏడో క్లాజ్ ప్రకారం తాగునీటికి కేటాయించిన వాటిలో కేవలం 20% పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని, ఆ లెక్కన 16.5 టీఎంసీల్లో కేవలం 3.3 టీఎంసీలు లెక్కలోకి వస్తాయన్నారు. ఎస్ఎల్బీసీ కింద సాగు, తాగునీటి అవసరాల రీత్యా మొత్తంగా 45 టీఎంసీల వినియోగానికి అనుమతించాలని కోరారు. లేఖతోపాటు అవార్డు కాపీలు, జీవోల కాపీలను పంపారు.
పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ నుంచి ఎస్ఆర్బీసీ, చెన్నై తాగునీటికి కలిపి 34 టీఎంసీలను మాత్రమే వినియోగించుకొనే హక్కు ఉన్నదని, ఆ మేరకు మాత్రమే ఏపీకి అనుమతివ్వాలని కేఆర్ఎంబీని మురళీధర్ కోరారు. అన్ని ఔట్లెట్లపై సెన్సర్లతో కూడిన రియల్ టైం డాటా అక్విజిషన్ సిస్టమ్ ఏర్పాటుచేసి, మళ్లిస్తున్న నీటిని పక్కాగా లెక్కగట్టాలని విజ్ఞప్తిచేశారు. ఔట్లెట్లపై సెన్సర్ల ఏర్పాటు అంశంపై కేఆర్ఎంబీ అభిప్రాయం కోరటంతో రాష్ట్రప్రభుత్వ విధానాన్ని తెలుపుతూ గురువారం ఆయన లేఖరాశారు. పోతిరెడ్డిపాడు నుంచి 34 టీఎంసీలు మాత్రమే మళ్లించుకొనే హక్కు ఉండగా, 2021-22లో 112 టీఎంసీలు మళ్లించిందని తెలిపారు.
తాము ఇటీవల చేపట్టిన 13 ఎత్తిపోతల పథకాలపై ఏపీ చేస్తున్న వాదనలన్నీ అసంబద్ధమేనని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచేసింది. నిబంధనల పరిధిలోకి రాని మైనర్ ప్రాజెక్టులపై దృష్టిసారించడం మాని, ఏపీ అక్రమంగా చేపట్టిన మేజర్ ప్రాజెక్టుల విస్తరణను అడ్డుకోవాలని మురళీధర్ డిమాండ్చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని హుజూర్నగర్, నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాల పరిధిలోని చివరి ఆయకట్టు భూములకు కృష్ణా జలాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 13 ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. వాటిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేయటంతో బోర్డు తెలంగాణ ప్రభుత్వాన్ని వివరణ కోరుతూ లేఖ రాసింది. దానికి మురళీధర్ సమాధానమిస్తూ 13 ఎత్తిపోతల పథకాలు నేరుగా కృష్ణా నది నుంచి నీటిని తీసుకొనేలా చేపడుతున్నవి కావని తెలిపారు. అవన్నీ నాగార్జునసాగర్ ఎడమ కాలువపై ఏర్పాటు చేస్తున్నవేనని స్పష్టంచేశారు.