హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తేతెలంగాణ): పట్టణ ప్రాంత అడవుల నిర్వహణ, సమీప ప్రాంతాలకు పర్యావరణ సమతుల్యత అందేలా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయని కేంద్ర అడవులు, పర్యావరణశాఖ ప్రతినిధి బృందం ప్రశంసించింది. అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధిలో దేశానికి తెలంగాణ నాయకత్వం వహిస్తుందనటంలో సందేహం లేదని అభిప్రాయపడింది. ఈ దిశగా అటవీశాఖ చేస్తున్న ప్రయత్నాలు అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నది. తెలంగాణలో రక్షిత అటవీప్రాంతాలు, వాటి రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేసేందుకు కేంద్రం బృందం ఐదురోజులపాటు రాష్ట్రంలో పర్యటించింది. రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి, కర్ణాటక మాజీ పీసీసీఎఫ్ బీకే సింగ్ నేతృత్వంలో డాక్టర్ పీకే మాథుర్, డాక్టర్ పీఎస్ ఈసా, డాక్టర్ సీ రమేశ్తోపాటు రక్షిత అటవీ ప్రాంతాల నిర్వహణ, అభివృద్ధిలో నిపుణులు మరో నలుగురు ఈ బృందంలో ఉన్నారు. సంగారెడ్డి జిల్లా మంజీరా, మహబూబాబాద్ జిల్లా పాకాల అభయారణ్యంలతోపాటు హైదరాబాద్ శివారు మహావీర్ హరిణ వనస్థలి, మరికొన్ని అటవీప్రాంతాల్లో ఈ బృందం పర్యటించిం ది. బుధవారం ఈ బృందం అరణ్యభవన్లో తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధానాధికారి (పీసీసీఎఫ్) ఆర్ శోభ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యింది. ఈ సందర్భంగా అడవులు, పట్టణాలు, ఆవాసాలకు సమీపంలోని అటవీ ప్రాంతాలను నిర్వహిస్తున్న తీరు ను పీసీసీఎస్ ఆర్ శోభ బృందానికి వివరించారు. అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధి అద్భుతంగా ఉన్నదని, రానున్న రోజుల్లో ఇవి చక్కని పర్యావరణ కేంద్రాలుగా మారుతాయని కమిటీ సభ్యులు ప్రశంసించారు. సమావేశంలో పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్ఎం డోబ్రియల్, పీసీసీఎఫ్ (అడ్మిన్, విజిలెన్స్) స్వర్గం శ్రీనివాస్, అడిషనల్ పీసీసీఎఫ్లు సిద్దానంద్ కుక్రేటీ, ఎస్ కే సిన్హా, ఎంజే అక్బర్, ఓఎస్డీ శంకరన్ పాల్గొన్నారు.